కోదండం .. ఒక్క చోటైనా గెలిచేనా...?
ప్రోఫెసర్ కోదండరాం. ఈ పేరు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితం. తెలంగాణా రాష్ట్ర సాధనలో ఆయన చేసిన అలుపెరుగని కృషి అనిర్వచనీ యం. వంటా వార్పూ, మేధావుల ఫోరం వంటి అనేక రూపాల్లో ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లిన నాయకుడు. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమ సారథి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు కుడి భుజంగా మెలిగిన మేధావి కూడా కోదండరామే! మరి అలాంటి నాయకుడి పాత్ర ఇప్పుడు తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఎలా ఉంది? ఏమేరకు ఆయన ప్రభావం చూపించారు? మహాకూటమి ఆయనను మోసిందా? లేక ఆయన మహాకూటమినే మోశారా? ఇవన్నీ కాకుండా ఆయనో తురుపు ముక్కగా మారారా? అనే అనేక సందేహాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. గడిచిన నాలుగేళ్ల కాలంలో అధికార పార్టీపై తిరుగులేని విమర్శలు చేసిన కోదండం రాం.. ఎన్నికల సమయానికి మరింతగా ఈ వేడిని పెంచారు.
విమర్శలు ఎదుర్కొన్నా....
ప్రధానంగా ధర్నా చౌక్ను కేసీఆర్ తొలగించిన సమయంలో కోదండ రాం రోడ్డెక్కి పెద్ద ఇష్యూ చేశారు. తద్వారా తన పోరు ఇంతటితో ఆగదని చెప్పుకొచ్చారు. ఉస్మానియా విద్యార్థులను వెంట పెట్టుకుని లక్ష ఉద్యోగాలు ఎక్కడని, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే సొంతగా ఆయన పార్టీ ని స్థాపించారు. ఈ ఏడాది మార్చి 31న హైదరాబాద్ వేదికగా తెలంగాణా జనసమితి పేరుతో కోదండ రాం పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్-టీడీపీ-సీపీఐలతో కూడి న మహాకూట మిలో తాను కూడా వేలు పెట్టారు. నిజానికి ఒకప్పుడు తెలంగాణాకు పట్టిన శని చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విమర్శులు గుప్పించిన కోదండ రాం వెళ్లి వెళ్లి చంద్రబాబు చెంతనే చేరిపోయారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన పట్టించుకోలేదు.
పోటీకి దూరంగా.....
ఇక, ఎన్నికల్లో పోటీ విషయానికి వచ్చేసరికి.. మొత్తం 119 స్థానాలలోనూ కేవలం 15 స్థానాల్లో ఆయన పోటీ చేయాలని అనుకున్నా.. చివరాఖరికి కేవలం 7 స్థానాలతోనే సరిపుచ్చుకున్నారు. మెదక్ - జనార్దన్రెడ్డి, మల్కాజ్గిరి - కపిలవాయి దిలీప్, దుబ్బాక - చిందం రాజ్కుమార్, సిద్దిపేట - భవానీ రెడ్డి , వరంగల్ తూర్పు - ఇన్నయ్య, మిర్యాల గూడ - విద్యాధర్ రెడ్డి, మహబూబ్నగర్ - రాజేందర్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే, తాను మిర్యాల గూడ, జనగామ, మంచిర్యాల, వరంగల్ పశ్చిమం నుంచి పోటీ చేయాలని భావించినా.. కాంగ్రెస్ అభ్యర్థుల పోటీ పోటీతో ఆయన ఏకంగా సీటు దక్కించుకోలేక పోయారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ తమకు అన్యాయం చేసిందని కోదండ రాం ప్రకటించడం గమనార్హం. అయితే, కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు కోదండరాంను బుజ్జగించారు. మహాకూటమి కన్వీనర్ పోస్టును ఆయనకు కట్టబెట్టారు.
ప్రాధాన్యం తగ్గినా....
తీరా ఎన్నికల సమయానికి వారం రోజుల ముందు నుంచి కోదండరాం ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. ఏ నాయకులు కోదండరాంను తెలంగాణాలో పెద్ద ఐకాన్గా పేర్కొన్నారో వారే చివరకు ఆయనను పక్కన పెట్టారు. మొత్తం ఎన్నికలంతా కూడా మహాకూటమి చంద్రబాబు కేంద్రంగా మారిపోయింది. ప్రతి సభలోనూ చంద్రబాబుతో ప్రసంగించేందుకు ఎక్కువ సమయం ఇచ్చారే తప్ప.. కోదండరాంను ఎక్కడా ప్రొజెక్టు చేయేలకపోయారు. ఇక, విద్యార్థులు తన వెంటే ఉంటారని భావించిన కోదండానికి ఇది కూడా కలిసి రాలేదు. ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా ఆయనకు అనుకూలంగా ప్రకటన చేయలేదు. దీంతో ఎన్నికల రోజు నాటికి కోదండ రాం పరిస్తితి మహాకూటమిలో నానా టికీ తీసికట్టుగా మారిపోయింది. ఆయన బలపరిచి టికెట్లు ఇప్పించుకున్న నాయకులకు కూడా మహాకూటమి తరఫున పెద్దగా ప్రచారం చేయించుకునే అవకాశం దక్కలేదు.
ఒక్క చోటైనా.....
ఇక ఆ పార్టీ పోటీ చేస్తున్న సీట్లు సైతం ఓడిపోయేవే అన్న చర్చ నడుస్తోంది. దీంతో కోదండరాం ఎన్నికల్లో ఓ ఆటలో అరిటి పండుగా మారిపోయారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం ఒక్కచోటైనా ఆయన నిలబెట్టిన అభ్యర్థులు విజయం సాధించకపోతే.. ఆయన మరింతగా చిక్కుల్లో పడడం ఖాయమని అంటున్నారు. మరి ఈ మేధావి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- Nara Chandrababunaidu
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- telugudesamparty
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వామపక్ష పార్టీలు