కాంగి‘‘రేసు’’ గుర్రం అదేనా...??
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాత్తు ఉంటుందీ? లేనిదీ ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి చేతుల్లోనే ఉందన్నది ఏపీ కాంగ్రెస్ నేతలకు తెలియంది కాదు. నిన్న మొన్నటి వరకూ ఏపీలో ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో ఎండగట్టిన ఏపీ హస్తం పార్టీ నేతలు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ప్రభుత్వ చర్యలు భేష్ అని మెచ్చుకోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కొత్త నినాదంతో....
అయితే ఏపీ కాంగ్రెస్ నేతలు కొత్త నినాదాన్ని తలకెత్తుకున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఇవే చివరి ఎన్నికలని ప్రజల్లో పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా రాకుంటే ఇక అది తెరమరగవుతుందని వారు చెబుతున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందని గట్టిగా ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలు విస్తృతంగా ఏపీలో పర్యటిస్తూ ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని వారు పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు.
పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో.....
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన నినాదంతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. దానికి ఇంకా సమయం పడుతుంది. ఎన్నికలకు ముందు పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. కుదరకపోయే ఛాన్సు కూడా ఉంది. అందుకోసమే సొంతంగా బలపడాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇన్ ఛార్జి ఉమెన్ చాందీతో కూడా పార్టీ నేతలు దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని, తొలుత ఎంపీ స్థానాలపైనే దృష్టి పెట్టాలని ఉమెన్ చాందీ పార్టీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు.
పొత్తు ఉన్నా లేకున్నా.....
అయితే కాంగ్రెస్ లో ఒకవర్గం నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని కూడా కొందరు ఆందోళన చేస్తున్నారు. తమిళనాడు తరహాలాగే ఇక్కడ కూడా ఉనికిని కోల్పోవడం కంటే సొంతంగా ఎదగడమే మంచిదని పలువురు సీనియర్ నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. మొత్తం మీద హైకమాండ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీపై విమర్శలు మాత్రం తగ్గించిందనే చెప్పాలి. అంటే చంద్రబాబు, రాహుల్ గాంధీ మధ్య ఎటువంటి డీల్ కుదురుతుందన్నది ఇంకా తెలియకపోవడంతో బాబుపై విమర్శలు చయకపోవడమే మంచిదని భావించి, ప్రత్యేకహోదా ఇప్పుడు రాకుంటే ఇక రాదని చెబుతూ జనంలోకి వెళుతున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- indian national congress
- janasena party
- nallari kirankumar reddy
- nara chandrababu naidu
- pawan kalyan
- raghuveera reddy
- rahul gandhi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నల్లారికిరణ్ కుమార్ రెడ్డి
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- రఘువీరారెడ్డి
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ