ఆ స్థానంలో ఇంత గందరగోళమా..?
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కానీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా లేని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ తో పాటు మహాకూటమి అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. రెండు పార్టీల నుంచి ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఉండటంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీలు తేల్చలేకపోతున్నాయి. దీంతో ఎవరికి వారే టిక్కెట్ ప్రయత్నాల్లో మునిగిపోయారు. మొన్నటి దాకా మహాకూటమిలో కాంగ్రెస్ కే మేడ్చెల్ స్థానం దక్కుతుందని అంతా భావించినా ఇప్పుడు టీజేఎస్ కూడా ఈ స్థానాన్ని తమకు వదిలేయాలని కోరుతోంది. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిగా కొంపల్లి మోహన్ రెడ్డిని ప్రకటించి ముందుంది.
కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ...
4.80 లక్షల ఓటు బ్యాంకు ఉన్న మేడ్చల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల లొల్లి తారస్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన తోటకూర జంగయ్య యాదవ్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. సీనియర్ నేత ఉద్దెమర్రి నరసింహారెడ్డి, మరో నేత కందాడి స్కైలాబ్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, కేఎల్లార్, జంగయ్య టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జంగయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి 70 వేల ఓట్లు సాధించారు. రేవంత్ రెడ్డి తన టిక్కెట్ తెస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు. మరోవైపు సీనియర్ నేత అయిన కేఎల్లార్ కూడా అధిష్ఠానం వద్ద తనకున్న పరిచయాలతో టక్కెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా... అసలు ఈ సీటు కాంగ్రెస్ కే ఉంటుందా లేదా మహాకూటమిలో భాగంగా టీజేఎస్ కు వదిలేస్తారా..? అనేది ప్రశ్నగా మారింది. టీఆర్ఎస్ లో టిక్కెట్ ఆశించిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇటీవల తెలంగాణ జన సమితిలో చేరారు. ఆయన టిక్కెట్ పై స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే టీజేఎస్ లో చేరారని తెలుస్తోంది. అయితే, టీజేఎస్ కు టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ ఆశావహులు ఊరుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
మల్లారెడ్డి కన్ను మేడ్చెల్ సీటుపై...
ఇక టీఆర్ఎస్ లోనూ ఇటువంటి పరిస్థితే ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఫస్ట్ లిస్టులో పేరు దక్కలేదు. అయినా టిక్కెట్ తనకే వస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. అన్ని గ్రామాలు, మండలాల్లో పార్టీ నాయకులతో ఈ మేరకు తీర్మానాలు చేస్తూ పార్టీ పెద్దలకు పంపిస్తున్నారు. తన టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇస్తున్నారు. మరో వైపు మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి మేడ్చెల్ స్థానంపై కన్నేశారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ అధికరంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవాలనేది మల్లారెడ్డి ఆలోచన. ఇప్పటికే మేడ్చెల్ టిక్కెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేటీఆర్ నుంచి హామీ ఉందని, టిక్కెట్ కచ్చితంగా తనకే అని చెబుతున్నారు. నియోజకవర్గంలోని నేతలను తనవైపు తప్పుకునే పనిలో ఉన్నారు.
అసమ్మతి రేగే అవకాశం...
ఇక మరో నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ కూడా మేడ్చెల్ టిక్కెట్ తనకే అని ధీమాతో ఉన్నారు. బీసీ ఈక్వేషన్ లో టిక్కెట్ తనకు ఇస్తారని ఆశిస్తున్నారు. మొన్నటివరకు టిక్కెట్ రేసులో ఉన్న హరివర్ధన్ రెడ్డి ఇక టీఆర్ఎస్ లో లాభం లేదని టీజేఎస్ నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తానికి మేడ్చెల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎక్కడా లేని గందరగోళం ఏర్పడింది. రెండు పార్టీల్లోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కచ్చితంగా అసమ్మతి సేగలు రేగే అవకావం కనిపిస్తోంది. రెండు పార్టీ ఆశావహులు టిక్కెట్ రాకుండా ఇండిపెండెంట్ గా పోటీకి సై అంటున్నారు.