కుదిరితే మంత్రి... వీలయితే ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడవచ్చు. అటువంటిది తామకేం తక్కువ అనుకుంటున్నారో ఏమో కానీ ఎంపీలుగా పోటీ చేయాల్సిన వారు ఇప్పుడు అసెంబ్లీ స్థానాలను టార్గెట్ చేశారు. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో వీరి నెత్తిన పాలు పోసినట్లయింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి ఉంటే వీరెవరికీ ఈ అవకాశం దక్కేది కాదు. ముందే ఎన్నికలు రావడంతో అసెంబ్లీకి పోటీ చేసి పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండాలని లేదా మంత్రిగానైనా అవకాశం వస్తుందని ఆశతో ఉన్నారు. ఇప్పటికే పలువురు రంగంలోకి దిగి ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు.
అల్లుడికే ఎర్త్ పెడుతున్న సర్వే...
దళిత ముఖ్యమంత్రి అంశం తెరపైకి వస్తే తనకు అవకాశం ఉంటుందని భావించిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలనుకుంటున్నారు. ఇందుకుగానూ ఆయన ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్ స్థానంపై కన్నేశారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే... పార్టీ అధికారంలోకి వస్తే తనకు ప్రభుత్వంలో మంచి అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి నమ్మకాస్తుడు కావడంతో ముఖ్యమంత్రి పదవి దక్కినా దక్కవచ్చని ఆయన అనుకుంటున్నారు. అయితే, కంటోన్మెంట్ స్థానాన్ని స్వయానా ఆయన అల్లుడు, ఓయూ విద్యార్థి నేతగా పనిచేసి కాంగ్రెస్ లో ఉన్న క్రిషాంక్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనే మొదట టిక్కెట్ ను ఆయనకు ప్రకటించినా తర్వాత వెనక్కి తీసుకుని గజ్జెల కాంతంకి ఇచ్చారు. దీంతో ఈసారి ఎలాగైనా టిక్కెట్ దక్కించుకుని విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఇక మరో నాయకుడు శ్రీగణేష్ కూడా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
పార్టీలో కీలక పదవి ఉండటంతో...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఇటీవలే నియమితులైన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా అసెంబ్లీ బరిలో ఉండాలనుకుంటున్నారు. పీసీసీలో కీలక పదవి ఉన్నందున అసెంబ్లీకి ఎన్నికైతే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం కరీంనగర్ స్థానాన్ని ఆయన ఎంపిక చేసుకుని పనిచేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మీనరసింహారావు టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే, పొన్నంకి టిక్కెట్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా ఈసారి అసెంబ్లీ బరిలో ఉండనున్నారని తెలుస్తోంది. ఇందుకుగానూ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన మహబూబాబాద్ లేదా డోర్నకల్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి కూడా అంత బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఆయనకు టిక్కెట్ దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. పార్టీ కూడా ఆయనను అసెంబ్లీకే పోటీచేయించాలని భావిస్తోంది.
మునుగోడు బరిలో కోమటిరెడ్డి..!
ఇక భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అసెంబ్లీ బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని రెండుమూడేళ్లుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. టిక్కెట్ రేసులో ఆయనే ముందున్నారని తెలుస్తోంది. అయితే, దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి ఈ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆమె కూడా టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మొత్తానికి నలుగురు మాజీ ఎంపీల దృష్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల పైన పడింది. ఒకవేళ గెలిస్తే మంచిది లేకపోయినా మళ్లీ ఎంపీగా పోటీచేసే ఆప్షన్ ఉంది కదా అని వీరి భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ కి అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనందున మాజీ ఎంపీలు బలమైన అభ్యర్థులుగా నిలిచే అవకాశం ఉండటంతో వీరికి టిక్కెట్ల కేటాయింపునకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పే ఛాన్స్ లేదంటున్నారు.