దశమి వేడుకల్లో ఇద్దరు చంద్రులు కలుస్తారా?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు కారణాల నేపథ్యంలో ఆగర్భ శత్రువుల్లాగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. వీరిద్దరూ తమ మధ్య ఉన్న
శత్రుత్వాన్ని పురస్కరించుకుని వీలైనంత వరకు ఒకరికొకరు తారసపడకుండానే రోజులు నెట్టుకొస్తున్నారనే ప్రచారం ప్రజల్లో బాగా ఉంది. పెళ్లిళ్లకు అతిథులుగా
వెళ్లినా.. ఇరువురూ వేర్వేరు టైమింగ్స్ లో వెళ్లడం, గవర్నర్ ‘ఎట్ హోమ్’ వంటి విందులు ఏర్పాటుచేస్తే ఎవరో ఒకరు పూర్తిగా ఎగ్గొట్టడం వంటివి గతంలో చాలా
జరిగాయి. అయితే అనివార్యంగా.. క్రిష్ణా జలాల అపెక్స్ కమిటీ సమావేశం వంటివి కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు పాపం.. వారికి ఎదురు పడక తప్పడం లేదు.
అయితే ఇప్పుడు కీలక చర్చ ఏంటంటే.. ఈ దశమి వేడుకల్లో ఇద్దరు చంద్రులు కలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది జనం మాట్లాడుకుంటున్నారు.
ప్రతి దసరా వేడుకల సందర్భంగా తెలంగాణ భాజపా నాయకుడు ప్రస్తుతం కేంద్రమంత్రి కూడా అయిన బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని చాలా
ఆత్మీయంగా నిర్వహిస్తుంటారు. అన్ని పార్టీల ప్రముఖుల్ని దీనికి ఆహ్వానిస్తారు. పైగా ఈసారి ఆయన పదవిలో ఉన్న నాయకుడు గనుక.. ఆయన పిలుపునకు
నేతలంతా బాగానే స్పందిస్తారని అనుకోవచ్చు. అలాంటి దత్తన్న , సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అలయ్ బలయ్ కు ప్రత్యేకంగా
ఆహ్వానించారు. ‘చంద్రబాబు గారూ తప్పకుండా రావాలి’ అని మరీ మరీ నొక్కి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాబు అంగీకరించినట్లు కూడా
చెబుతున్నారు.
దత్తన్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా హాజరవుతారు. అయితే ఇప్పుడు క్రిష్ణా జలాల పంపకాలపై ఇంకా పచ్చిగానే ఉన్న తగాదాలు,
ఓటుకు నోటు కేసు విషయంలో ఇంకా సాగుతున్న విచారణ.. ఇలాంటి ఇతర పరిస్థితులు నేపథ్యంలో అలయ్ బలయ్ లో ఇద్దరు చంద్రులు పరస్పరం ఎదురు
పడేలా పాల్గొటారా? వేర్వేరు సమయాల్లో వచ్చి మొహం చూపించి వెళ్లిపోతారా? అనేది సందేహంగా మారుతోంది. మౌలికంగా రెండు తెలుగు రాష్ట్రాల
ముఖ్యమంత్రుల మద్య ఉండవలసినంత సఖ్యత లేకుండా.. ఈ వాతావరణం వల్ల రెండు రాష్ట్రాలకూ నష్టమేనని జనం అనుకుంటున్నారు.

