తమిళనాడులో ఇప్పుడు ఏదైనా జరగొచ్చు
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ నిమిషానికోసారి ప్రత్యర్థులకు చుక్కలు చూపుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్, వెంకటేశ్ ల ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ వెల్లడించారు. శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా జరిగిన ఎన్నిక చెల్లదంటూ ఇప్పటికే పన్నీర్ వర్గం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఒక పక్క పార్టీ పై పట్టు సాధించేందుకు రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. శశికళ జైలు కెళ్లే సమయంలో తన సమీప బంధువులైన దినకరన్, వెంకటేశ్ లకు పార్టీ పదవులకు కట్టబెడుతూ నియామకాలు జారీ చేశారు. ఈ నియామకాలు చెల్లవంటూ పన్నీర్ వర్గం ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఇప్పటికే అన్నాడీఎంకే కోశాధికారిగా ఉన్న పన్నీర్ అన్ని బ్యాంకుల అకౌంట్లన్నింటినీ స్థంభింప చేశారు. తన అనుమతి లేకుండా డబ్బులు విత్ డ్రా చేయడానికి వీలు లేదని బ్యాంకులకు లేఖలు కూడా రాశారు. పార్టీ మీద పట్టు సాధిస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం తమ చేతుల్లోకి వస్తుందన్నది పన్నీర్ వర్గం భావన. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. మరోవైపు జల్లికట్టు తరహా ఉద్యమం చేయాలని కూడా పన్నీర్ వర్గీయులు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ఏర్పాటయిన ప్రభుత్వాన్ని దించేద్దాం రమ్మంటూ సోషల్ మీడియాలో ఆహ్వానాలు పంపుతున్నారు. దీంతో తమిళనాడులో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే అభిప్రాయం నెలకొంది. ఈ సోషల్ మీడియాలో ఆందోళన చేయాలని పిలుపునివ్వటం చూసిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. చెన్నై నగరంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలు జారుకుంటారా?..
మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్స్ ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా రేపు జరిగే బలపరీక్షలో ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గురువారం పళనిస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్ భవన్ కు వచ్చిన ఎమ్మెల్యేలపై ప్రజలు దాడి చేసినంత పనిచేశారు. అసభ్యపదజాలంతో దూషణలకు కూడా దిగారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి ఈ పరిస్థితులు మింగుడుపడటం లేదు. దినకరన్ , తంబిదురై లు ఇద్దరూ ఇప్పటికే గోల్డెన్ బే రిసార్ట్స్ కు చేరుకుని ఎమ్మెల్యేలను సముదాయిస్తున్నారు. పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు. 40 మంది కాదు కనీసం పది మంది ఎదురుతిరిగినా పళని స్వామికి భంగపాటు తప్పదు. అందుకోసం ఎమ్మెల్యేలపై సామ,దాన,బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. శనివారం ఉదయం జరిగే బలపరీక్షలో శశివర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పళనికి మద్దతు పలుకుతారో...ఎవరు పలకరో? అన్న టెన్షన్ లో పళనిస్వామి బ్యాచ్ ఉంది. మొత్తం మీద గత 14 రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠ నిన్న సీఎం ప్రమాణస్వీకారంతో తొలిగిపోయిందనుకుంటే...రోజుకో చిక్కు వచ్చి పడుతుంది.
- Tags
- తమిళనాడు రాజకీయం