చంద్రబాబుపై జాలిపడుతున్న తెదేపా శ్రేణులు!

నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి సారథ్యం వహించడానికి పూనుకోవడం ద్వారా చంద్రబాబునాయుడు తప్పు చేశారా? రాజకీయంగా అపర చాణక్యుడిగా పేరున్న, పర్యవసానాలను ఊహించి తదనుగుణంగా నడుచుకోవడంలో అపరమేధావిగా పేరున్న చంద్రబాబునాయుడు... ప్రజల కష్టాలు తొలగించడానికి, డిజిటల్ మనీని కార్యరూపంలోకి తీసుకురావడానికి అవసరమైన సూచనలు చేయాల్సి ఉన్న కమిటీ సారథ్యానికి పూనుకుని.. తన నెత్తిన తానే చెత్త వేసుకుంటున్నారా? ఈ విషయంలో ఆయన మనోగతం ఎలా ఉన్నదో గానీ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం అలాగే భావిస్తున్నాయి.
నోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కారు మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఏర్పడిందని తెలుగుదేశం శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మోదీ సర్కారును ఇంకా మన భుజాల మీద మోస్తున్న కొద్దీ ప్రజల దృష్టిలో మనం కూడా విలన్లుగా తయారు కావడం తప్ప సాధించేది ఏమీ ఉండదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. జనానికి నోటు కష్టాలు అనేవి ప్రస్తుతం నోట్ల లభ్యత చాలినంతగా లేనందువల్ల చాలా ఎక్కువగా ఉంది.
ఇప్పుడు అందరూ కష్టాలు పడుతున్నారు గనుక.. ఆన్ లైన్, మొబైల్ ఆర్థిక లావాదేవీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పుడు పనిచేయడం ప్రారంభించి.. కొన్ని నెలల వ్యవధిలో ఎలాంటి సిఫారసులు ప్రభుత్వానికి సమర్పించినా.. ఈ నెలల గడువులోగా కొత్త నగదు అందుబాటులోకి వస్తే గనుక.. ప్రజల కష్టాలు తగ్గిపోయి.. ఇక డిజిటల్ లావాదేవీల ఊసులకు ప్రాధాన్యం తగ్గిపోవచ్చు.
అదే సమయంలో... పార్టీ శ్రేణుల్లో మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబు సారథ్యంలోని కమిటీ.. డిజిటల్ లావాదేవీలకు సిఫారసులు చేస్తూనే.. ఆ చైతన్యం ప్రజల్లో పెరగడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు కల్పించాలి. పన్నుల విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి.. అనేదిశగా సూచనలు చేసినట్లయితే.. అలాంటి మార్పు చేర్పులకు మోదీ సర్కారు సిద్ధంగా ఉంటుందనే నమ్మకం వీరికి కలగడం లేదు. అలాంటి పరిణామాలు గనుక జరిగితే.. ఈ కమిటీకి సారథిగా ప్రజల దృష్టిలో నిందలన్నీ చంద్రబాబే భరించాల్సి వస్తుందని కూడా వారు అనుకుంటున్నారు.