Mon Dec 15 2025 10:08:45 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో సంస్థ పై సుప్రీకోర్టు కీలక నిర్ణయం
ఇండిగో సంస్థ వందలాది విమానాలను రద్దు చేసిన అంశంలో న్యాయస్థాన జోక్యం కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

ఇండిగో సంస్థ వందలాది విమానాలను రద్దు చేసిన అంశంలో న్యాయస్థాన జోక్యం కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యం పెండింగ్లో ఉన్నందున, అక్కడే తమ వాదనను వినిపించాలని పిటిషనర్కు సూచించింది. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, విపుల్ ఎం పాంచోలీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ నరేంద్ర మిశ్రా తరఫు వాదనలు వినిపిస్తూ, ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఢిల్లీ హైకోర్టులో...
అయితే ఇదే విషయంపై ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే మరో పిల్ను పరిశీలిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా, డిసెంబర్ 10వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇండిగో విమానాల రద్దులతో ఏర్పడిన సంక్షోభాన్ని అదుపు చేయడంలో కేంద్రం సకాలంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడటం, ఇతర విమాన సంస్థలు భారీ చార్జీలు వసూలు చేయడం వంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వందలాది విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు సహాయం అందించాలి, టికెట్ రీఫండ్లు ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది.
Next Story

