Fri Dec 05 2025 09:31:21 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka : తెలంగాణ బాటలోనే కర్ణాటక సిద్ధరామయ్య సర్కార్
కర్ణాటక ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలో పయనిస్తుంది. కర్ణాటకలోనూ కులగణన చేయాలని నిర్ణయించింది

కర్ణాటక ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలో పయనిస్తుంది. కర్ణాటకలోనూ కులగణన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి కులగణన కర్ణాటకలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటకలో కులగణన ప్రారంభమయినప్పటికీ, బెంగళూరు నగరంలో మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. బెంగళూరు మహా నగరంలో కులగణన చేసే సిబ్బందికి శిక్షణ పూర్తి కాకపోవడంతో ఒకటి రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని బెంగళూరు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
వచ్చే నెల ఏడో తేదీ వరకూ...
కర్ణాటకలో ప్రారంభమయిన కులగణన నేడు ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ లెక్కింపులో సుమారు 1.75 లక్షల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్యుమరేటర్లుగా ఉంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కోట్ల మందిని, దాదాపు రెండు కోట్ల కుటుంబాలను ఈ కులణనలో ఇంటింటికి తిరిగి సర్వే చేయనున్నారు. కులగణనకు అయ్యే మొత్తం వ్యయాన్ని 420 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేసింది.
అరవై ప్రశ్నలతో కూడిన...
కర్ణాటక వెనుకబడిన వర్గాల కమిషన్ ఈ లెక్కింపును సైంటిఫిక్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం అరవై ప్రశ్నలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కులగణనలో హిందూ, క్రైస్తవ కులాల పేర్లు రెండింటితోనూ ఉన్న 33 కులాల (ఉదా: కురుబ క్రిస్టియన్, బ్రాహ్మణ క్రిస్టియన్, వొక్కలిగ క్రిస్టియన్) అంశంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కమిషన్ స్పందిస్తూ, ఈ కులాల పేర్లు జాబితా నుంచి తొలగించలేదని, కానీ యాప్లో మాత్రం మాస్క్ చేశామని" అధికారులు తెలిపారు. పౌరుడు తనకు నచ్చినట్లు కులాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
Next Story

