Sat May 24 2025 12:53:35 GMT+0000 (Coordinated Universal Time)
Jayalalitha : చేజారిన నాలుగువేల కోట్ల ఆస్తులు.. వారసులు వారు కారా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయంలో కర్ణాటక కోర్టు సంచలన తీర్పు చెప్పింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయంలో కర్ణాటక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. జయలలితకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయని పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు ఆస్తులు ఎన్నో ఉన్నాయి. భూముల, బంగారం వంటి వాటితో వాటి మార్కెట్ విలువ నాలుగు వేల కోట్ల రూపాయలుపైగానే ఉంటుందని ఒక అంచనాగా వినిపిస్తుంది. అయితే దీనిపై వాదనలు విన్న బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఈ ఆస్తులు వారసులకు చెందవని, తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వానికి...
వచ్చే నెల 14, 15 తేదీల్లో వాటికి అప్పగించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవివాహిత. ఆమెకు వారసలు లేరు. అయితే సహజంగా ఆమె ఆస్తి తమకు చెందాలంటే జయలలిత సోదరుడి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీప, దీపక్ లు తాము జయలలిత వారసులమని చెప్పారు. ఆ ఆస్తి తమకే దక్కాలంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలితకు ఉన్న ఆస్తులు వారసత్వంగా తమకే చెందుతాయని వారి తరుపున న్యాయవాదులు వాదించినా ఫలితం లేకుండా పోయింది. జయలలిత సినిమా నటిగా, రాజకీయంగా వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ ఆమె మాత్రం వీలునామా ఎవరికీ రాయలేదు.
భూములు, బంగారు ఆభరణాలు...
దీంతో కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం మాత్రం జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే చెందాలని తీర్పు చెప్పింది. జయలలితకు పదిహేను వందల ఎకరాల భూమి ఉంది. 27 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. దీంతో పాటు వజ్రాభరణాలు, వస్త్రాలతో పాటు అనేక వస్తువులను తమకు అప్పగించాలని, వారసులం తామేనని దీప, దీపక్ లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 900 కోట్ల రూపాయలు ఉంటుందని, అయితే మార్కెట్ విలువ మాత్రం నాలుగు వేల కోట్ల రూపాయలుకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. మరి జయలలిత వారసులు దీనిపై ఏంచేయనున్నారన్నది తెలియాల్సి ఉంది.
Next Story