Sun Mar 15 2026 11:35:20 GMT+0530 (India Standard Time)
పరారీలో జయప్రద
మాజీ ఎంపీ, నటి జయప్రద తనపై ఉన్న రెండు కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు

మాజీ ఎంపీ, నటి జయప్రద తనపై ఉన్న రెండు కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు ఆమెను "పరారీ"లో ఉన్నట్లుగా ప్రకటించింది. ఈ కేసులు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంబంధించినవి. ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ, జయప్రద కోర్టు ముందు హాజరుకాకపోవడంతో ఆమెపై ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మార్చి 6న జయప్రద కోర్టుకు హాజరు అయ్యేలా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని న్యాయమూర్తి శోభిత్ బన్సార్ ఎస్పీని ఆదేశించారు. జయప్రదపై సెక్షన్ 82 CrPC కింద చర్య తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
జయప్రద గతంలో రాజ్యసభ ఎంపీగానూ, లోక్ సభ ఎంపీగానూ ఉన్నారు. అయితే రాంపూర్ నియోజకవర్గంలో అజమ్ ఖాన్ తో వివాదాల నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ నుంచి వైదొలగి 2019లో బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు.
Next Story

