Sat Mar 07 2026 17:59:17 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లే... స్కూళ్లకు సెలవులు
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి

ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. ఢిల్లీలో గంట వ్యవధిలోనే 11 సెంమీల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. అదీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో ఈ వర్షపాతం నమోదయినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ట్రాఫిక్ కు అంతరాయం...
గంటల తరబడి ట్రాఫిక్ లోనే వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోనే ఆర్కేపురం, జన్పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, మయూర్ విహార్ వంటి చోట్ల భారీ వర్షం నమోదయింది. వరద నీటిలో చిక్కుకుపోవడంతో అనేక మంది అవస్థలు పడ్డారు. దీంతో ఎవరూ ఇళ్లు వదలి బయకు రావద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో భారీ వర్షానికి చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.
చిరు వ్యాపారులు....
తమ వస్తువులన్నీ తడిచి పోవడంతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సాయంత్రానికి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేయడంతో ఆఫీసులకు వెళ్లేవారు ఒక్కసారిగా బయటకు రావద్దని పోలీసులు నగర ప్రజలకు సూచించారు. మరో వైపు నేడు ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Next Story

