Mon Feb 02 2026 12:41:28 GMT+0000 (Coordinated Universal Time)
పుణ్యస్నానాలకోసం వెళ్లి.. బంగాళాఖాతంలో చిక్కుకున్న 511 మంది భక్తులు
గంగాసాగర్ లో పుణ్యస్నానాలకై సుమారు 511 మంది యాత్రికులతో రెండు నౌకలు బయల్దేరాయి. అవి ఎంవీ లచ్చమతి..

పుణ్యస్నానాల కోసమని వెళ్లి.. బంగాళాఖాతంలో 511 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో జరిగింది. హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశాన్ని గంగాసాగర్ గా పిలుస్తారు. అక్కడ ప్రతి ఏడాది సంక్రాంతి రోజున లక్షలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తారు. ఈ ఏడాది కూడా అదే మాదిరి.. భక్తులు పుణ్యస్నానాలకై భారీ సంఖ్యలో తరలివచ్చారు. అలా గంగాసాగర్ కు వెళ్తున్న 511 మంది భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు.
గంగాసాగర్ లో పుణ్యస్నానాలకై సుమారు 511 మంది యాత్రికులతో రెండు నౌకలు బయల్దేరాయి. అవి ఎంవీ లచ్చమతి, ఎంవీ అగరమతి కాక్ ద్వీపం వద్ద చిక్కుకుపోయాయి. అందుకు కారణం దట్టమైన పొగమంచు. ద్వీపానికి సమీపంలో దట్టంగా పొగమంచు, అలలు తక్కువగా ఉండటంతో.. రెండు నౌకలూ ముందుకు కదల్లేక అక్కడే ఆగిపోయాయి. దాంతో ఆదివారం (జనవరి15) రాత్రంతా యాత్రికులు నౌకల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న కోస్టుగార్డు సిబ్బంది పడవలను ఏర్పాటు చేయగా.. యాత్రికులను పడవల ద్వారా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు.
Next Story

