Wed May 21 2025 04:04:26 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : భారత్ బలం.. బలగం.. చూసిన తర్వాత ఎవరైనా గన్ను ఎత్తగలరా?
ఉగ్రవాదుల ఊపిరి తీయడానికి భారత్ కు పెద్ద కష్టం కాదని బలమైన సంకేతాలను పంపగలిగింది

ఉగ్రవాదుల ఊపిరి తీయడానికి భారత్ కు పెద్ద కష్టం కాదని బలమైన సంకేతాలను పంపగలిగింది. ఆపరేషన్ సిందూరతో తమ సత్తా ఏంటో చాటి చెప్పగలిగింది. భారత్ ను తక్కువగా అంచనా వేసిన వారు ఇరవై నాలుగు నిమిషాల్లోనే కథ ముగించేసిన ఆపరేషన్ చూసి నోళ్లు తెరిచాయి. ఇంత పకడ్బందీగా ఎలా దాడులు చేయగలిగాయన్న ఆశ్చర్యం నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారత్ మెతకవైఖరిని చూసి చేత కాని తనంగా భావించే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది ఒక గుణపాఠంగా చెప్పాలి. కలుగులో దాక్కున్నా వదిలిపెట్టబోమన్న స్ట్రాంగ్ వార్నింగ్ భారత్ ఆర్మీ పంపగలిగింది. తమ మౌనాన్నిచేతకాని తనంలా చూడవద్దని, అవసరమైతే ఏరివేయడం క్షణాల్లో పని అని చాటి చెప్పగలిగిన ఇండియన్ ఆర్మీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
కాశ్మీర్ లో కాలుమోపాలంటే?
దొంగచాటుగా ప్రవేశించి దొడ్డిదారిని వచ్చి అమాయకులైన ప్రాణాలను హరించి వేస్తున్న ఉగ్రవాదుల పనిపట్టడం తమకు చిటెకలో పని భారత్ ఆర్మీ ఈ ఆపరేషన్ సిందూర ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. చేతులు ముడుచుకుని కూర్చోవడానికి తాము సిద్ధంగా లేమన్న సిగ్నల్స్ పంపగలిగింది. దీంతో ఉగ్రవాదులు సయితం భారత్ లో కాలు మోపేందుకు జంకే విధంగా భారత్ వ్యవరించిన తీరును అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఆఫ్ ది రికార్డులో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గుట్టుగా పీచమణచడం తమకు చిటికెలో పని అని చేసి చూపించడంతో కాశ్మీర్ లో కాలుమోపే ప్రతి ఉగ్రవాదికి ఇది భయంకరమైన వార్నింగ్ చెప్పొచ్చు అని అంతర్జాతీయ ప్రముఖులే మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారంటే భారత్ ఏ రేంజ్ లో దాడి చేసిందన్నది చూడాలి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా...
భారత్ తన సాంకేతిక బలం ఏంటో కూడా అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పగలిగింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇరవై నాలుగు నిమిషాల్లో భారత్ గడ్డపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం అంటే ఆషామాషీ కాదు. దానికి గట్స్ తో పాటు పూర్తి అత్యాధునిక పరిజ్ఞానం ఉండాలి. ఆ రెండూ భారత్ కు ఉన్నాయని ఈ ఆపరేషన్ సిందూర తేల్చిపారేసింది. ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేశాయి. ఉగ్రమూకల ఊపిరిని ఆపేశాయి. అసలు భారత్ కు ఇదెలా సాధ్యమయిందని వారే ఆశ్చర్యపోతున్నారంటే భారత సైన్యం బలం.. బలగం ఏపాటిదో అర్ధమయిన తర్వాత ఇటు చూసే ధైర్యం కూడా చేయకపోవచ్చన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
ఎంత మంది చనిపోయారనే కంటే...
ఉగ్రవాదులు ఎంత మంది చనిపోయారన్నది లెక్క కాదు. వారు ఇన్నాళ్లు తలదాచుకున్న స్థావరాలనే క్షణాల్లో ధ్వంసం చేయగలిగామంటే అదొక్కటి చాలదూ. ప్రపంచ దేశాలు సయితం పాకిస్తాన్ కు మద్దతిచ్చే ధైర్యం చేయలేవు. ఇందుకు కారణం కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామన్న భారత్ వాదనను ప్రతి దేశం అంగీకరించాల్సిందే. సమర్థించాలి కూడా. ఉగ్రవాదుల దాష్టీకానికి ప్రతి దేశం బలవుతున్న ఈ సమయంలో భారత్ ఒక దిక్సూచీగా నిలిచిందని అంతర్జాతీయ నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు భారత్ చర్యను సమర్థిస్తున్నాయంటే ఆ విజయం చాలు...ఉగ్రవాదులను భవిష్యత్ లో లేకుండా చేయడానికి మరింత బలం దొరికినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story