Thu Mar 19 2026 20:19:05 GMT+0530 (India Standard Time)
"పార్లమెంట్ డిజైన్ శవపేటికలా ఉంది" : ఆర్జేడీ
పార్లమెంటు నూతన భవనం డిజైన్ను శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ ట్వీట్ చేసింది. ఓ వైపు పార్లమెంట్ భవనం, మరోవైపు శవపేటిక..

దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సెంగోల్ (రాజదండం) ప్రతిష్టాపన చేసి పార్లమెంట్ ను ప్రారంభించారు. అయితే.. ఈ ప్రారంభోత్సవాన్ని పలు పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభిస్తేనే వస్తామని తెగేసి చెప్పాయి. వాటిలో ఆర్జేడీ కూడా ఒకటి. తాజాగా ఆర్జేడీ నూతన పార్లమెంట్ డిజైన్ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
పార్లమెంటు నూతన భవనం డిజైన్ను శవపేటికతో పోలుస్తూ ఆర్జేడీ ట్వీట్ చేసింది. ఓ వైపు పార్లమెంట్ భవనం, మరోవైపు శవపేటిక ఫొటోను జతచేసి షేర్ చేస్తూ.. ‘ఏంటిది?’ అని ప్రశ్నించింది. దీనిపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశమని ఇలా చెప్తున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, చర్చలకు అది స్థానమని, ఇలాంటి పార్లమెంట్ ను దేశం అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ డిజైన్ పై ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా సైతం హెచ్చరించారు. ఈ ట్వీట్ వార్ ఎంతవరకూ దారితీస్తుందో చూడాలి.
Next Story

