Wed Mar 18 2026 20:38:02 GMT+0530 (India Standard Time)
Puri Jagannadh Temple : నేడు తెరుచుకోనున్న రహస్య గది తలుపులు
పూరీలో నేడు రహస్య గది తలుపులు తెరుచుకోనున్నాయి. మూడో గదిలో ఉన్న పెట్టెల్లో ఏముందన్నది నేడు తెలియనుంది.

పూరీలో నేడు రహస్య గది తలుపులు తెరుచుకోనున్నాయి. మూడో గదిలో ఉన్న పెట్టెల్లో ఏముందన్నది నేడు తెలియనుంది. పూరీ జగన్నాధునికి సంబంధించి అనేక బంగారు, వెండి, వజ్రాభరణాలున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అవన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా. అన్నది నేడు తేలనుంది. రత్నాలు, కెంపులు, పసిడి ఆభరణాలు, కిరీటాలను ఈరోజు కమిటీ పరిశీలిస్తుంది. రహస్య గది తలుపులు నేడు తెరవనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొన్న ఆదివారం పూరీ జగన్నాధుని ఖజానా గదిని తెరిచిన కమిటీ ప్రతినిధులు కేవలం పెట్టెలు, అల్మరాలు ఉన్నట్లు చూశారు. కానీ వెనక్కు వచ్చారు. ఆదివారం మళ్లీ ఆ రహస్య గదికి సీల్ వేశారు.
మరమ్మతులు పూర్తయిన తర్వాత...
ఈరోజు రహస్య గదిని తెరిచి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తారు. ఆదివారం సమయం లేకపోవడంతో గదిలో ఉన్న అల్మరాలను, పెట్టెలను పరిశీలించలేదు. దీంతో ఈరోజు రహస్య గదిని తెరిచి పెట్టెలను, అల్మరాలను పరిశీలించనున్నారు. రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందని జరుగుతున్న ప్రచారంపై కూడా అధ్యయనం చేయనున్నారు. దీంతో ఈరోజు ఉదయం ఎనిమిది గటల నుంచి భక్తులకు ఆలయంలో ప్రవేశం ఉండదని అధికారులు తెలిపారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలను, అల్మరాలను స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. రహస్య గదిలో మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత తిరిగి ఆభరణాలు లెక్కించి రహస్యగదికి చేరుస్తామని చెబుతున్నారు.
నలభై ఆరేళ్ల తర్వాత...
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత తెరిచారు. జస్టిస్ బిశ్వనాధ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. చివరగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్ (లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారు.
Next Story

