Thu May 09 2024 02:46:16 GMT+0000 (Coordinated Universal Time)
లోక్ సభలో రాహుల్ అదిరేటి స్పీచ్
రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు
రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో 48 శాతం మంది ప్రజల ఆదాయం కరోనా కాలంలో పడిపోయిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు. దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై రాహుల్ గాంధీ మాట్లాడారు.
గవర్నర్ల సహకారంతో....
గవర్నర్ల సహకారంతో రాష్ట్రాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్నదేమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ, పెగాసస్, ఎలక్షన్ కమిషన్ వంటి వాటితో రాష్ట్రాల గొంతునొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ దేశంలో పేదలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ప్రధాని స్వయంగా ఇజ్రాయిల్ వెళ్లి పెగాసెస్ స్పైవేర్ పై ఒప్పందం కుదుర్చుకుని వచ్చారన్నారు. తనను అగౌరవపర్చినా ఊరుకుంటానని, దేశ ప్రజలను అవమనిస్తే సహించనని రాహుల్ చెప్పారు.
దేశం ఒంటరిగా....
పదేళ్లలో దేశం మరింత బలహీన పడిపోయిందన్నారు. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పారు. దేశం పొరుగు దేశాల మధ్య ఒంటరి అయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ దేశం కోసం తన కుటుంబం ప్రాణాలను త్యాగం చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్, చైనాలను ఏకం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని రాహుల్ ఫైర్ అయ్యారు. ప్రజల అభిప్రాయాలకు దేశంలో విలువ లేకుండా పోయిందన్నారు. రాహుల్ ప్రసంగాన్ని అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. అయినా రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Next Story