Thu Mar 19 2026 04:53:28 GMT+0530 (India Standard Time)
దేశంలో వారిద్దరే లాభపడుతున్నారు
భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు

భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ దేశ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాని మోడీ జనం జేబులు లూటీ చేస్తున్నారన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కేవలం ఇద్దరు మాత్రమే ఆధారపడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో అభద్రత పెరిగిపోయిందన్నారు. లాభదాయక ప్రాజెక్టులన్నీ ఆ ఇద్దరికే దక్కుతున్నాయని తెలిపారు.
ధరలు ఆకాశంలో.....
టీవీలో వార్తలు వింటూ ప్రజలు ఆ ఛానల్ ఎవరిదని ప్రజలు బేరీజు వేసుకునే ప్రయత్నం వచ్చిందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను వాడుకుంటూ ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మేం వీటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని గంటలు తమను విచారించినా ఇబ్బంది లేదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయిందన్నారు. దేశ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మోదీ మీడియాలోనే కాలం గడుపుతున్నాడని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేకపోయినా మోదీ మళ్లీ కావాలని, రావాలని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వంలో లక్షల కోట్లు ఉపాధి హామీ పథకం కింద పేదలను ఆదుకున్నామని, కానీ ఈ ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ పేదలను పట్టించుకోలేదన్నారు.
Next Story

