Sat Dec 06 2025 03:16:03 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి స్కూళ్ల మూసివేత
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా రేపటి నుంచి ప్రైమరీ పాఠశాలలను మూసివేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి ప్రైమరీ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం బాగా పెరుగుతుందన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ ల నుంచి వస్తున్న పొగ ఈ కాలుష్యం పెరగడానికి కారణమని చెప్పారు. అక్కడ రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడంతోనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. హస్తినలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటిందన్నారు. అవుట్ డోర్ గేమ్స్ ను కూడా నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు.
వాయు కాలుష్యం పెరగడంతో...
వాయు కాలుష్యం పెరగడంతో ఢిల్లీలో శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేయాలని కోరారు. అలాగే సరి బేసి విధానంలో కూడా వాహనాల రాకపోకలు ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. పంజాబ్ లో రైతులు వ్యర్థాలు దహనం చేస్తున్నదానికి తమదే బాధ్యత అని, అక్కడ కూడా తమ ప్రభుత్వం ఉందని ఆయన గుర్తు చేశారు. ఒక ఏడాది సమయం ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఢిల్లీలో సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తామని తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలసి ఆయన మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు.
Next Story

