Sat Dec 06 2025 09:39:40 GMT+0000 (Coordinated Universal Time)
మోదీకి రక్తంతో లేఖ.. ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రక్తంతో లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆ లేఖ సారాంశం. ఎస్సై పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని, దానిపై సమగ్రంగా విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము కష్టపడి చదివి, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన తమను పక్కనపెట్టి.. అక్రమంగా ఎస్సై పోస్టులు పొందాలనుకునేవారికి అధికారులు సహాయపడుతున్నారని అధికారులు ఆరోపించారు.
ప్రధాని మోదీ తమకు న్యాయం చేయాలని, ఆయనపైనే తమకు నమ్మకం ఉందని లేఖలో రాశారు. డబ్బున్నవారికే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న విధానం వచ్చేసిందని, ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు లంచాలకు కక్కుర్తి పడటం వల్ల తాము మానసికంగా చచ్చిపోయామన్నారు. ఎస్సై పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగితే నక్సల్స్ లో చేరతామని అభ్యర్థులు హెచ్చరించారు. కాగా.. మొత్తం 8 మంది అభ్యర్థులు ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. వారంతా తమపేర్లు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
Next Story

