Sat Jul 27 2024 01:14:49 GMT+0000 (Coordinated Universal Time)
మరింత తీవ్రమైన బిపోర్ జాయ్..హెచ్చరికలు జారీ
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పర్యాటక ప్రాంతమైన తితాల్ బీచ్ ను మూసివేశారు. సముద్రమంతా అల్లకల్లోలంగా..
![biporjoy cyclone updates, biporjoy live tracking, saurashtra-kutch coast biporjoy cyclone updates, biporjoy live tracking, saurashtra-kutch coast](https://www.telugupost.com/h-upload/2023/06/12/1510921-biporjoy.webp)
అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన బిపోర్ జాయ్ తుపాను మరింత తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుతం తీవ్రతుపానుగా కొనసాగుతున్న బిపోర్ జాయ్మ.. మరికొద్ది గంటల్లో మరింత తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిప్రభావంతో గుజరాత్ తో పాటు కర్ణాటక, గోవా ల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పర్యాటక ప్రాంతమైన తితాల్ బీచ్ ను మూసివేశారు. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. జూన్ 15వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరించాయి.
ఈ తుపాను గుజరాత్ లోని మాండవి- పాకిస్థాన్ లోని కరాచీల మధ్య తీరందాటనున్న నేపథ్యంలో సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. సౌరాష్ట్ర- కచ్ కోస్ట్ లకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 15 మధ్యాహ్నానికి తుపాను తీరం దాటతుందని అంచనా వేసింది. తీరాన్ని తాకే సమయంలో తీరంవెంబడి 125 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్లలో ఇది రెండవ బలమైన తుపానుగా పేర్కొంది. ఈ తుపాను ప్రభావం కచ్, జామ్ నగర్, మోర్బి, గిర్, సోమనాథ్ ప్రాంతాలపై అధికంగా ఉండనున్నట్లు అంచనా వేసింది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తీరప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. 6 జిల్లాల్లో ముంపుప్రాంత బాధితులను తరలించేందుకు షెల్టర్లను ఏర్పాటు చేశారు.
Next Story