Thu Jan 29 2026 10:45:56 GMT+0000 (Coordinated Universal Time)
L. K. Advani : ఎల్.కె. అద్వానీకి అస్వస్థత... ఎయిమ్స్ లో చేరిక
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నిన్న అర్ధరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అద్వానీ వయసు 96 ఏళ్లు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. అద్వానీని ఎయిమ్స్ లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు యూరాలజీ వైద్య నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యసేవలను అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
నిలకడగానే ఉందని...
అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఏడాది అద్వానీని భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. మార్చి 30వ తేదీన రాష్ట్రపతి, ప్రధాని ఆయన ఇంటికి వెళ్లి మరీ అవార్డును అందచేసి వచ్చారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న బీజేపీ నేతలు ఎయిమ్స్ కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు.
Next Story

