Thu Mar 19 2026 21:33:52 GMT+0530 (India Standard Time)
Arvind Kejriwal: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
ఎన్నికలు జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రి

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బెయిల్పై తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో జరగాల్సిన దేశ రాజధాని ఎన్నికలను మహారాష్ట్ర ఎన్నికలతో కలిసి నవంబర్లో నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ‘‘ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్నికలు జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రి అవుతారు" అని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాను.. ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనన్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఇంటికి, వీధికి వెళ్తాను తప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. ప్రజల నుండి తీర్పు వచ్చే వరకూ ముఖ్యమంత్రి స్థానంలో తాను కూర్చునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. మరో రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పార్టీ సభ్యుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అయితే మనీష్ సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లేదని ఆప్ అధినేత ప్రకటించారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో అరెస్టు చేసినా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలు తన సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవని కేజ్రీవాల్ తెలిపారు. దేశం కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు కేజ్రీవాల్.
Next Story

