Fri Dec 05 2025 12:21:02 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాట నటి కస్తూరి సంచలన కామెంట్స్.. రాచుకున్న రగడ
తమిళనాడులో సినీనటి కస్తూరి డీఎంకే పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో సినీనటి కస్తూరి డీఎంకే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుణానిధి కుటుంబం నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిందని ఆమె అన్నారు. తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెద్దయెత్తున విమర్శలు కూడా వచ్చాయి. హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరుపున బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ సినీనటి కస్తూరి ఈ వ్యాఖ్యలు చేశారు. మూడువందల సంవత్సరాల నుాడు రాజుల కాలంలో అంతపురంలో మహిళలకు సేవల చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారని కస్తూరి అన్నారు.
వివరణ ఇచ్చిన నటి కస్తూరి...
అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె అన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగు వారు ఎవరు? అంటూ కస్తూరి ప్రశ్నించినట్లు ఆ సభలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. దీనిపై వివాదం తలెత్తడంతో కస్తూరి వివరణ ఇచ్చారు. డీఎంకే వాళ్లు తనపై ఫేక్ ప్రచారానికి తెరలేపారన్న కస్తూరి, తెలుగుగడ్డ తనకు మెట్టినిల్లుతో సమానమని చెప్పారు. కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని కస్తూరి అన్నారు. తాను ఎవరిని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయలేదని కస్తూరి వివరణ ఇచ్చుకున్నారు.
Next Story

