హిమాలయాల వద్ద చోటు చేసుకున్న అరుదైన దృశ్యం
హిమాలయాల వద్ద చోటు చేసుకున్న అరుదైన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.

హిమాలయాల వద్ద చోటు చేసుకున్న అరుదైన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. దక్షిణ టిబెట్ లోని ప్యూమోయంగ్చు సరస్సు సమీపంలో దాదాపు 105 ఎత్తైన దీప స్తంభాల్లా కొన్ని రేఖలు కనిపించాయి. వీటిని కొందరు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఈ చిత్రాలను స్ప్రింగ్ నేచర్ పత్రిక ప్రచురించింది. వీటిని ‘రెడ్ స్ప్రైట్స్’ అని పిలుస్తారు. తాజాగా వైరల్ అయిన చిత్రాలు దక్షిణాసియాలో వచ్చిన తుపాన్లలో అత్యధికంగా రెడ్ స్ప్రైట్స్ కనిపించినవిగా యూనివర్శిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా పరిశోధకులు తేల్చారు. ఈ రెడ్ స్ప్రైట్స్ భూమికి దాదాపు 40 నుంచి 50 మైళ్ల ఎత్తులో ఏర్పడతాయి. ఇవి సాధారణ మెరుపుల్లా కాకుండా జెల్లీఫిష్ ఆకారంలో ఎరుపు రంగులో తళుక్కున మెరుస్తాయి. కొన్ని సార్లు నీలిరంగులో కూడా కనిపిస్తాయి. మే 19వ తేదీ రాత్రి చైనాకు చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్లు ఏంజెల్ యాన్, సుచాంగ్ డాంగ్ ఈ రెడ్ స్ప్రైట్స్ను తమ కెమెరాల్లో బంధించారు.