Tue Jan 20 2026 15:22:22 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తమ్ కన్ను ఇక అక్కడే
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పై దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు

పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఆయన వీలయినప్పుడల్లా హుజూర్ నగర్ లో పర్యటిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి విజయం సాధించారు. అయితే ఎంపీ ఎన్నికలు రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
ఉప ఎన్నికలో.....
అయితే ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలయింది. సాధారణ ఎన్నికల్లో గెలిచి ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ సమీక్షలు నిర్వహించుకుంది. అధికార పార్టీ ఇచ్చిన హామీలే కారణమని చెబుతుంది. హామీలు ఏమీ అమలుపర్చలేదని, ఈసారి హుజూర్ నగర్ లో యాభై వేల మెజారిటితో గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
తరచూ పర్యటనలు...
ఆయన రచ్చబండ, రైతు భరోసా యాత్రలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏవీ అమలు పర్చలేదని, గొర్రెలు రెండో విడత ఇస్తామని ఇవ్వలేని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Next Story

