మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ప్రకాష్ రాజ్ నటన అంటే అందరికి ఎంతో ఇష్టమే. ప్రకాష్ రాజు స్టార్ హీరోల సినిమాల్లో తండ్రి, అన్న, విలన్ పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ సినిమాల్లో నటనకు ఎంత పేరుందో .... సినిమాల సెట్స్ లో మాత్రం ఆయన చెప్పిన సమయానికి, ముందుగా ఇచ్చిన షెడ్యూల్కి తగ్గట్లుగా రాడు. వచ్చినా కూడా ఆయనతో ఓ సీన్ తీసేసరికి ఆయనను భరించడం కష్టమవుతుందని పలువురు దర్శకనిర్మాతలు చెబుతూ ఉంటారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈయన తన ప్రవర్తన కారణంగా అనేక చిత్రాలలో చాన్స్లు పోగొట్టుకున్నాడు. ఇక రాజమౌళి వంటి దర్శకుడే 'విక్రమార్కుడు'లో ఓ చిన్న పాత్ర ఇచ్చి షూటింగ్లో నానా ఇబ్బందులు పడి వదిలేశాడు.
అలాగే ప్రకాష్ రాజు ఇండస్ట్రీలో శ్రీనువైట్లతో పాటు పలువురితో తగాదాలు కూడా పెట్టుకుంటాడు. ఇక ఈయన దెబ్బకు బలైన నిర్మాతల ఒత్తిడితో ఆయనపై ఒకసారి బహిష్కరణ వేటు కూడా పడింది. ఇక నేటి దర్శకులలో కొరటాల శివది డిఫరెంట్ స్టైల్. ఆయన పెద్దగా ఎవరిని కోపగించుకోడు. ప్రస్తుతం ఆయన దానయ్య నిర్మాతా 'శ్రీమంతుడు' తర్వాత మహేష్బాబుతో రెండో చిత్రం 'భరత్ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఇందులో మహేష్బాబు యంగ్ సీఎంగా నటిస్తుండగా మరో కీలకమైన పాత్రకు కొరటాల ప్రకాష్రాజ్ని తీసుకున్నాడు. కానీ ఆయన అసలు సమయానికే రావడం లేదట. ఉదయం రావాల్సిన వ్యక్తి, సాయంత్రం బ్రేక్ చెప్పే సమయంలో వస్తూ ఉండటం, ఆయన మీద ఒక్క సీన్ కూడా తీయకుండానే ప్యాకప్లు జరుగుతుండటంతో కొరటాల శివ ఆయనపై ఎంతో కోపంగా ఉన్నాడట.
మరి ఇంతగా యిబ్బంది పెడుతున్న ప్రకాష్ రాజ్ స్థానంలోకి వేరే వారిని తీసుకోవాలని కొరటాలఫిక్స్ కాగా, దానికి నిర్మాత దానయ్య కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహేష్బాబు ను కూడా సంప్రదించి, ప్రకాష్రాజ్ ప్రవర్తనను ఆయనకు కూడా విడమరిచి చెప్పి, తమను ఆయన ఇబ్బంది పెడుతున్న తీరు, ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉండటంతో మహేష్ అనుమతితో ఈ పాత్రకు వేరొకరిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్రలో రావు రమేష్ని తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది...!

