Fri May 03 2024 00:32:55 GMT+0000 (Coordinated Universal Time)
బెల్లంకొండ ఆఫర్ ని స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?
అల్లుడు శీను చిత్రంతో వెండితెరకి పరిచయమైనా యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి ప్రయత్నంతో భారీ అంచనాలను అందుకోలేక విఫలమై రెండవ చిత్రంగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సుందర్ పాండియన్ అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేసి స్పీడున్నోడు తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ చిత్రం ఘోర పరాజయం చెందటంతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ జోరు తగ్గిపోయింది. అయితే తొలి చిత్రంతోనే సమంత తో నటించిన శ్రీనివాస్, తన రెండు చిత్రాలలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా చేత ప్రత్యేక గీతాలలో డాన్స్ చేపించారు. కాగా అల్లుడు శీను మిగిల్చిన నష్టాలతో ఫైనాన్షియర్స్, బయ్యర్స్ వద్ద గుడ్ విల్ కోల్పోయిన నిర్మాత బెల్లంకొండ సురేష్ దర్శకుల పేర్లనే నిర్మాతగా వేస్తూ తెర వెనుక తాను వుంటున్నారని టాక్ కూడా ప్రచారంలో వుంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణలో బిజీగా వున్న బెల్లంకొండ శ్రీను తన తదుపరి చిత్ర దర్శకత్వ బాధ్యతలను శ్రీ వాస్ కి అప్పగించారు. ఈ చిత్రాన్ని తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న శ్రీ వాస్ వెనుక బెల్లంకొండ సురేష్ వున్నారని గుసగుసలు వినపడుతుండగా ఇప్పుడు కథానాయిక ఎంపిక విషయంలో శ్రీ వాస్ తీసుకుంటున్న జాగ్రత్తలను చూస్తుంటే ఈ విషయం పై స్పష్టత ఏర్పడుతుంది. తన కొడుకు నటించే ప్రతి చిత్రంలోనూ స్టార్ హీరోయిన్ చేత నటింపజేస్తున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు శ్రీ వాస్ చిత్రానికి శృతి హాసన్ ని భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఇంకా శృతి హాసన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, తారక్, రవి తేజ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన శృతి హాసన్ బెల్లంకొండ వారి ఆఫర్ ని స్వీకరిస్తుందో లేదో చూడాలి.
Next Story