బెంగుళూరు లో విడుదల అయిపోయిన బాహుబలి
మాహిష్మతి రాజనీతిని కాపాడుతున్న కట్టప్పని, మాహిష్మతికి ఇద్దరు యువ రాజులను పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన మహారాణి శివగామి, యువరాజులు అమరేంద్ర బాహుబలి, భల్లాలదేవ, అమరేంద్ర బాహుబలిని మనువాడిన దేవసేన, మాహిష్మతి శత్రు సైన్యం ఐన కాలికేయుడి సైన్యం. ఇవే మనకు బాహుబలి చిత్రంలో ప్రధానంగా కనిపించే పాత్రలు. కానీ బాహుబలి కామిక్ పుస్తకంలో మనకు పరిచయంలేని బాహుబలి కథ, మరియు ఎన్నో శత్రు సైన్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది కామిక్ పుస్తకం కావటంతో నిడివి ఆంక్షలు లేక శత్రు సైన్యాలను విరివిగా ప్రస్తావిస్తూ వచ్చి ఉండొచ్చు.
చిత్రానికి వచ్చే సరికి కథ చెప్పాల్సిన సమయం మితిమీరకుండా చూసుకోకతప్పదు. అందుకే బాహుబలి కథను అవసరం మేరకే సినిమా కథగా మార్చినట్టున్నారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. అయినప్పటికీ అది రెండు భాగాలుగా తెరకెక్కించవలసిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు లో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో బాహుబలి ది బాటిల్ ఆఫ్ స్వార్డ్స్ పేరుతో కామిక్ పుస్తకాన్ని విడుదల చేసారు. ఆ పుస్తకంలో మాహిష్మతికి శత్రు సైన్యాలుగా వివిధ దేశాలకు చెందిన సైన్యాలు తారసపడుతున్నాయి. పర్షియా, హిమన్షి, మంగోలియా, నెథర్లాండ్స్, కాంగో వంటి దెస సైన్యాలు మాహిష్మతి రాజ్యం పై యుద్ధం ప్రకటించిన కథనం కామిక్ పుస్తకంలో కనపడుతుంది.
బాహుబలి ది బాటిల్ ఆఫ్ స్వార్డ్స్ కామిక్ పుస్తకానికి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న బాహుబలి చిత్రానికి పోలిక ఉండబోదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనిపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.