బాబోయ్ '2 .0 ' కి అంత ఖర్చా

ఇండియాలోనే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు అంటేనే ఆహా ఓహో వామ్మో అన్నారు. ఇక బాహుబలి నిర్మాతలు కూడా రెండు పార్టులను కలిపి 450 కోట్లలో తెరకెక్కించినట్లుగా ప్రకటించారు. ఇక బాహుబలి సినిమా విడుదల కాకముందే శంకర్ - రజినీకాంత్ కాంబినేషన్ లో రోబో కి సీక్వెల్ గా '2.0' తెరక్కించడం స్టార్ట్ చేశారు. సినిమా మొదలెట్టినప్పటినుండి '2.0 ' బడ్జెట్ 400 కోట్లగా ప్రచారం జరుగుతూ ఉంది. లైకా ప్రొడక్షన్ వారు '2.0' కి భారీ బడ్జెట్ నే ఎక్కిస్తున్నారు. మరి శంకర్, రజిని కలయిక అంటే దానికున్న క్రేజ్ ముందు 400 కోట్లు ఒక లెక్కా అన్నారు అంతా.
అయితే ఇప్పుడు తాజాగా'2.0' కి 400 కోట్ల బడ్జెట్ కాస్తా 450 కోట్లకి పెరిగినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. భారత దేశంలోనే '2.0' భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ విషయమే కాక అన్నిటిలోను భారీ తనం ఉట్టిపడేలా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే యాక్షన్ సన్నివేశానికి ఒక్కదానికే 12 కోట్లు పెట్టించిన శంకర్ ఇప్పుడు ఒక పాట కోసం దాదాపు 32 కోట్లు పెట్టిస్తున్నాడనే టాక్ ఉండనే ఉంది. అలాగే చెన్నై శివార్లలోని ఈవీసీ వరల్డ్ అనే మూత పడ్డ థీమ్ పార్క్ ఉన్న 150 ఎకరాల స్థలాన్ని ‘2.0’ చిత్రీకరణ కోసం లీజుకు తీసుకున్నారట. దాదపు మూడేళ్ల కాలానికి రూ. 15 కోట్ల దాకా వెచ్చించి మరీ ఈ పార్క్ ని లీజుకి తీసుకున్నారట. '2.0' కోసం ఇక్కడే భారీ సెట్టింగ్స్ వేసి.. భారీ ఎత్తున చాలా సన్నివేశాలు చిత్రీకరించారట.
ఇక '2.0 ' విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసమే రూ. 100 కోట్ల దాకా ఖర్చయినట్లు చెబుతున్నారు. అలాగే '2.0 ' కి విలన్ గా చేసిన బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ తాను చేసిన షూటింగ్ కింద అంటే రోజుకి 2 కోట్ల లెక్కన భారీ పారితోషకమే అందుకోవడం....రజినీకి కొంత అడ్వాన్స్ గా ఇచ్చి లాభాల్లో వాటా తీసుకునేలా అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం వంటివే కాకుండా.. '2 .0 ' లో నటించే మిగతా నటీనటుల పారితోషకాలకే దాదాపు 100 కోట్లు ఖర్చవడం వెరసి '2.0 ' కి భారీగా 450 కోట్ల బడ్జెట్ ఖర్చవడం జరిగింది అంటున్నారు.

