Mon Feb 02 2026 00:36:09 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనలు రద్దు
థియేటర్ల వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్..

తమిళనాడులోని మల్టీప్లెక్స్ లలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం తో పాటు పలు ముఖ్యనగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షో లను యాజమాన్యాలు రద్దుచేశాయి. థియేటర్ల వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కొన్నిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అందుకే చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.
‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. సినిమా విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) నిరసన చేపట్టింది. చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని అన్నానగర్ ఆర్చ్లో 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story

