Thu Mar 28 2024 14:54:54 GMT+0000 (Coordinated Universal Time)
తారకరత్న అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన బాలకృష్ణ
తారకరత్న అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నందమూరి అభిమానులు..
ప్రముఖు సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న(39) గుండెపోటుకు గురై, బ్రెయిన్ డెడ్ తో కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న బెంగళూరు నుండి హైదరాబాద్ లోని మోకిలకు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్ లో తారకరత్న భౌతిక కాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కొద్ది సేపటి క్రితమే ఫిలించాంబర్ నుంచి తారకరత్న అంతిమ యాత్ర ప్రారంభమైంది.
చాంబర్ నుండి వాహనం వరకూ నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. బాబాయ్ బాలకృష్ణ కూడా పాడె మోశారు. తారకరత్న అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ తండ్రిని తీసుకెళ్తుంటే.. తారకరత్న ముగ్గురు పిల్లలు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. పెద్దకుమార్తె.. నాన్న తిరిగి రావా అంటూ విలపించింది. తారకరత్న కుమారుడు తనయ్ రామ్ చిన్నపిల్లాడు కావడంతో.. తండ్రి మోహన కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకు చితికి నిప్పుపెడుతున్న సమయంలో ఆయన తల్లడిల్లిపోయారు. తారకరత్న అంత్యక్రియలకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో పాటు వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు.
Next Story