Sun Feb 01 2026 19:31:11 GMT+0000 (Coordinated Universal Time)
Archaeology: మొదట మందుపాతర అని భయపడ్డారు.. లోపల ఉన్నది బంగారమే!!
కూలీలు వర్షపు నీటిని సేకరించేందుకు గొయ్యి తవ్వుతుండగా

కేరళలోని కన్నూర్ జిల్లాలో కూలీలు వర్షపు నీటిని సేకరించేందుకు గొయ్యి తవ్వుతుండగా బంగారం, వెండి వస్తువులు బయటపడ్డాయి. పరిప్పాయి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలోని రబ్బరు తోటలో గొయ్యి తవ్వుతున్న మహిళలకు 17 ముత్యాల పూసలు, 13 బంగారు లాకెట్లు, నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, చెవిపోగులు, అనేక వెండి నాణేలు లభించాయి. ఏదో దొరకగానే మొదట మందుపాతర అనుకున్నారు. భయపడిన కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఎంవీ షీజు బృందం విలువైన వస్తువులను అదుపులోకి తీసుకుని కోర్టుకు ఇచ్చారు. త్రవ్వకాలలో బయటపడిన విలువైన వస్తువులు ఏ కాలానివో, మూలాలను గుర్తించేందుకు కనుగొన్న వాటిని పరిశీలించాలని పురావస్తు శాఖను కోర్టు ఆదేశించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కళాఖండాలు చాలా పురాతనమైనవి. తదుపరి తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్లోని కచ్ జిల్లాలోని గ్రామస్థులు బంగారం కోసం తవ్వుతున్నప్పుడు హరప్పా కాలం నాటి పురాతన నాగరికత జాడలను కనుగొన్నారు. హరప్పా యుగం నాటి ప్రఖ్యాత ధోలవీర ప్రపంచ వారసత్వ ప్రదేశం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోద్రాని గ్రామంలో ఈ ఆవిష్కరణ జరిగింది.
Next Story

