Mon Feb 02 2026 05:03:44 GMT+0000 (Coordinated Universal Time)
మన్ననూరులో 800 ఏళ్ల నాటి క్వారీలు
సమీపంలోని రాతి తోరణం, కోట గోడలు కట్టడానికి ఈ రాతినే వాడి ఉంటారని ఆయన చెప్పారు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య..

మన్ననూరులో క్రీ.శ.12వ శతాబ్దం నాటి క్వారీలు
కల్యాణ చాళుక్యుల క్వారీలు
కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్- శ్రీశైలం రహదారిలో, మన్ననూరు ఘాట్ రోడ్ ప్రారంభంలో, కళ్యాణ చాళుక్యుల కాలపు రాతి క్వారీలను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వారసత్వ స్థావరాలను గుర్తించి, వాటిని కాపాడుకోవడానికి స్థానికులకు అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా, మన్ననూరు పరిసరాల్లోని ప్రతాపరుద్రుని కోట వద్ద రోడ్డు కుడి (ఉమామహేశ్వరం) వైపున రాతిని తొలచిన ఆనవాళ్లను గుర్తించారు.
సమీపంలోని రాతి తోరణం, కోట గోడలు కట్టడానికి ఈ రాతినే వాడి ఉంటారని ఆయన చెప్పారు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో ప్రస్తావించిన శివపుర ద్వారం ఈ తోరణమేనని ఈ ప్రాంతం పై విస్తృతంగా పరిశధనలు చేసిన చరిత్రకారుడు డా. ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారని, తద్వారా ఈ రాతి క్వారీలు క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందినవని తెలుస్తోందని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ రాతి క్వారీలను, తోరణ ద్వారాన్ని, ప్రతాపరుద్రుని కోట కాపాడుకొని, శ్రీశైలం వెళ్ళే పర్యాటకులను ఆకర్షించే విధంగా పరిసరాలను సౌకర్యాలతో అభివృద్ధి పరచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Next Story

