Sat Jul 27 2024 01:40:53 GMT+0000 (Coordinated Universal Time)
రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. మరో ఐపీఎల్?
చివరి బంతి వరకూ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు బంతుల్లో 10 రన్ లు చేయాల్సి ఉంది. చాలామంది చెన్నై విజయంపై
![dhoni gives clarity about his retirement dhoni gives clarity about his retirement](https://www.telugupost.com/h-upload/2023/05/30/1506678-dhoni-retirement.webp)
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీ అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సింది. కానీ భారీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డే కి మారింది. సోమవారం వాతావరణం అనుకూలంగా ఉంటుందని, వర్షం అడ్డుకాబోదని వాతావరణ నిపుణులు కూడా చెప్పడంతో.. గుజరాత్ - చెన్నై అభిమానులంతా మ్యాచ్ ను చూసేందుకు స్టేడియంకు చేరుకున్నారు. టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ జట్టు బ్యాటింగ్ పూర్తై.. చెన్నై బ్యాటింగ్ మొదలు కాగానే వర్షం అడ్డుపడింది. ఇక ఐపీఎల్ 2023 టైటిల్ గుజరాత్ కే అని చెన్నై అభిమానులంతా నిరాశ చెందారు. అర్థరాత్రికి వర్షం తగ్గడంతో.. 15 ఓవర్లకు మ్యాచ్ ను కుదించి.. చెన్నైకు 171 పరుగులను లక్ష్యంగా ఇచ్చారు.
చివరి బంతి వరకూ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు బంతుల్లో 10 రన్ లు చేయాల్సి ఉంది. చాలామంది చెన్నై విజయంపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ.. జడేజా నేనున్నాను అన్నట్టుగా.. ధోనీ స్టైల్ లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి చెన్నై జట్టు విజయానికి కారణమయ్యాడు. కాగా.. ధోనీ ఈ మ్యాచ్ లో ఒక్క రన్ కూడా చేయలేదు. మిల్లర్ కు డైరెక్ట్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో.. మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ ఐపీఎల్ లో తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ గెలుపు తన ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ అని ధోనీ చెప్పాడు. అద్భుతమైన విజయం సాధించిన ఈ క్షణం తన రిటైర్మెంట్ ప్రకటనకు సరైన సమయమని... 'థాంక్యూ వెరీ మచ్' అంటూ తన రిటైర్మెంట్ ను సింపుల్ గా ప్రకటించగలనని అన్నాడు.
మరో 9 నెలలు హార్డ్ వర్క్ చేసి, వచ్చే ఐపీఎల్ సీజన్ లో కూడా ఆడుతానని ధోనీ స్పష్టం చేశాడు. అందుకు తన శరీరం ఎంతమేరకు సహకరిస్తుందో కూడా చూడాలన్నాడు. వచ్చే ఐపీఎల్ లో ఆడాలో వద్దో తుది నిర్ణయం తీసుకోవడానికి మరో 6-7 నెలల సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. మరో ఐపీఎల్ ఆడటమనేది కష్టమైన పనే అయినప్పటికీ.. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ కోసం ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్ లో తాము సాధించిన ప్రతి ట్రోఫీ ప్రత్యేకమైనదే అని చెప్పాడు. మరో ఐపీఎల్ ఆడుతానని ధోనీ చెప్పడంతో.. మిస్టర్ కూల్ అభిమానులంతా ఆనందంలో మునిగిపోయారు.
Next Story