Strait of Hormuz : హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే నౌకలపై అమెరికా నౌకాదళం తక్షణ నిర్బంధం ప్రారంభిస్తుందని తెలిపారు. పాకిస్థాన్లో జరిగిన అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటన ప్రకారం ఈ నిర్బంధం సోమవారం ఉదయం 10 గంటల (ఈడీటీ) నుంచి, ఇరాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు అమల్లోకి వస్తుంది. అన్ని దేశాల నౌకలపైనా తటస్థంగా అమలు చేస్తామని పేర్కొంది. అయితే ఇరాన్కు చెందని పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలకు జలసంధి మార్గం అనుమతిస్తామని స్పష్టం చేసింది. దీంతో మొత్తం జలసంధిని మూసివేయాలన్న అధ్యక్షుడి ప్రారంభ హెచ్చరికతో పోలిస్తే ఈ ప్రకటన కొంత సడలింపుగా కనిపించింది.

