Sun Apr 12 2026 09:15:28 GMT+0530 (India Standard Time)
Iran - America Talks : ఇరాన్ -అమెరికా చర్చలు ఫలితం తేల్చలేదా? అసంపూర్తిగానే?
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి

ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు ఆదివారం తెల్లవారుజామున ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వడంలో ఇరాన్ ముందుకు రాకపోవడంతో చర్చలు నిలిచిపోయాయని చెప్పారు.ఈ కీలక చర్చలు 21 గంటలు సాగాయని, ఈ సమయంలో తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వాన్స్ వెల్లడించారు. “అణ్వాయుధాల కోసం ప్రయత్నించబోమని, వాటిని త్వరగా తయారు చేసే సాధనాలు కూడ సాధించబోమని వారు హామీ ఇవ్వాలి. అదే మా ప్రధాన లక్ష్యం” అని ఆయన విలేకరులతో చెప్పారు.
విరామం తర్వాత మళ్లీ...
పాకిస్థాన్ రాజధానిలో జరిగిన ఈ మూడో విడత చర్చలు కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని రోజులకే జరిగాయి. రెండు బృందాల సాంకేతిక నిపుణులు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారని పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. ప్రతినిధి బృందాల నేతలు కొద్దిసేపు విరామం తీసుకుని మళ్లీ సమావేశమవుతారని తెలిపారు.అమెరికా సైన్యం హోర్ముజ్ జలసంధిలో రెండు యుద్ధ నౌకలను పంపిందని తెలిపింది. సముద్ర గనుల తొలగింపునకు ముందు జాగ్రత్తగా ఇవి ప్రయాణించాయని పేర్కొంది. అయితే ఈ సమాచారాన్ని ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు ఖండించాయి.“ఒప్పందం వచ్చినా, రాకపోయినా మేము జలసంధిని శుభ్రం చేస్తున్నాం” అని ట్రంప్ విలేకరులతో చెప్పారు. చర్చలు లోతుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఇరాన్ టీవీ మాత్రం విభేదాలు తీవ్రమని తెలిపింది.
ఇరాన్ రెడ్ లైన్ ...
ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో సమావేశమై కొన్ని ‘రెడ్ లైన్’ స్పష్టంగా వివరించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం, నిలిపివేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.ఇరాన్ ప్రతిపాదించిన పది అంశాల్లో యుద్ధానికి పూర్తి ముగింపు, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ, తమ మిత్రబలగాలపై దాడులు ఆపడం ఉన్నాయి. అమెరికా ప్రతిపాదనల్లో ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితులు, జలసంధి మళ్లీ తెరవడం ఉన్నాయి.
ప్రాంతీయ ఉద్రిక్తతలతో...
ఈ యుద్ధం ఇప్పటివరకు ఇరాన్లో 3,000 మందికి పైగా, లెబనాన్లో 2,020 మంది, ఇజ్రాయెల్లో 23 మంది ప్రాణాలు తీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. మౌలిక వసతులకు భారీ నష్టం జరిగింది.హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచానికి చమురు, వాయువు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
ఇజ్రాయెల్–లెబనాన్ చర్చలు...
లెబనాన్లో కాల్పుల విరమణ లేదని చెబుతూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు మంగళవారం వాషింగ్టన్లో ప్రత్యక్షంగా సమావేశమవుతారని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ కార్యాలయం తెలిపింది. అయితే దేశంలో నిరసనలు జరుగుతుండటంతో ప్రధాని నవాఫ్ సలాం తన పర్యటన వాయిదా వేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైన రోజుల్లోనే ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా రంగంలోకి దిగింది. అనంతరం ఇజ్రాయెల్ వైమానిక దాడులు, భూభాగ దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ప్రకటించిన రోజే బీరూట్పై భారీ దాడులు జరిగి 300 మందికి పైగా మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story

