Fri Dec 05 2025 23:30:23 GMT+0000 (Coordinated Universal Time)
సూడాన్ లో కొనసాగుతున్న ఘర్షణలు.. 400 మందికి పైగా మృతి
దేశాలు కూడా తమ పౌరుల భద్రత దృష్ట్యా స్వదేశాలకు పౌరులను తరలించే చర్యలను చేపట్టాయి. సూడాన్ లో చిక్కుకున్న ఇండియన్స్ ను..

సూడాన్ లో కొద్దిరోజులుగా ప్రభుత్వ - వ్యతిరేక దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 3,351 మంది గాయపడినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సూడాన్ లో ప్రభుత్వ ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా అశాంతి నెలకొంది.
కొద్దిరోజులుగా సూడాన్ లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని ఖర్తౌమ్ లో చిక్కుకున్న తమ దేశాల పౌరులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు విమానాల ద్వారా తమ దేశానికి తరలిస్తున్నాయి. ఇతర దేశాలు కూడా తమ పౌరుల భద్రత దృష్ట్యా స్వదేశాలకు పౌరులను తరలించే చర్యలను చేపట్టాయి. సూడాన్ లో చిక్కుకున్న ఇండియన్స్ ను తరలించేందుకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు వాయుసేన విమానాలను స్టాండ్ బై గా ఉంచింది. వరుస పేలుళ్లతో సూడాన్ లోని నగరాలు దద్దరిల్లుతుండటంతో.. వేలాదిమంది సుడానీలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బాంబు పేలుళ్లు, తుపాకి కాల్పుల నుంచి తప్పించుకునేందుకు మరికొందరు ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. ఆహారం, నీళ్లు, కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Next Story

