Sun Mar 15 2026 09:30:56 GMT+0530 (India Standard Time)
Iran - Israel War : మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్ హెచ్చరికలు
అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం మూడో వారంలోకి చేరిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది

అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం మూడో వారంలోకి చేరిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మూడు పోర్టుల పరిసరాలను ప్రజలు ఖాళీ చేయాలని శనివారం కోరింది. అమెరికా దళాలు అక్కడ ఆశ్రయం తీసుకున్నాయని, అక్కడి నుంచి ఇరాన్ చమురు ఎగుమతుల ప్రధాన కేంద్రం ఖార్గ్ దీవిపై దాడులు జరిగాయని టెహ్రాన్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు మాత్రం ఇవ్వలేదు.యూఏఈలోని ప్రధాన పోర్టులను ఖాళీ చేయాలని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా దాడులు కొనసాగితే చమురు వసతులపై ప్రతీకారం తప్పవని టెహ్రాన్ హెచ్చరించింది.
దుబాయ్ ఎయిర్ పోర్టును...
దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టు లేదా అబుదాబీలోని ఖలీఫా పోర్టుపై దాడి జరిగినట్లు వెంటనే ఎలాంటి సమాచారం వెలువడలేదు. అయితే ఇరాన్ డ్రోన్ను అడ్డుకోవడం సమయంలో దాని అవశేషాలు ఫుజైరా పోర్టు సమీపంలోని చమురు సౌకర్యాలపై పడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అమెరికా దళాలు యూఏఈలోని రెండు ప్రాంతాల నుంచి దాడులు చేశాయని తెలిపారు. రాస్ అల్ ఖైమా, అలాగే “దుబాయ్కు చాలా సమీపంలోని ప్రాంతం” నుంచి ఖార్గ్ దీవి, అబూ ముసా దీవులపై దాడులు జరిగాయని చెప్పారు. ఆ ప్రాంతాల్లో జనసాంద్రత ఉన్నందున అక్కడ దాడులు చేయకుండా జాగ్రత్త పడతామని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ ప్రాంతాలపైనే...
ఈ ఆరోపణలపై అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందించలేదు. యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గర్గాష్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, తమ దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉందని అన్నారు. అయితే పరిస్థితుల్లో వివేకం పాటిస్తూ నియంత్రణతో ముందుకెళ్తామని తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ అరబ్ గల్ఫ్ ప్రాంతాల్లోని లక్ష్యాలపై వందల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అవి అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ చెబుతున్నా విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు వంటి పౌర వసతులపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం వెలువడింది.
హోర్ముజ్ జలసంధిపై టెన్షన్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలను “పూర్తిగా ధ్వంసం చేశాం” అని తెలిపారు. టెహ్రాన్ హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకుంటే చమురు వసతులపై కూడా దాడులు జరుగవచ్చని హెచ్చరించారు.దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందిస్తూ చమురు మౌలిక వసతులపై దాడులు జరిగితే మరింత తీవ్ర ప్రతీకారం ఉంటుందని చెప్పారు. హోర్ముజ్ జలసంధి తమపై దాడులు చేస్తున్న దేశాలు, వారి మిత్రులకు మాత్రమే మూసివేస్తామని అరఘ్చీ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, సరఫరాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో జలసంధి భద్రత కోసం చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ కోరారు. దీనిపై బ్రిటన్ మిత్రదేశాలతో వివిధ మార్గాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.ఇరాన్ మాత్రం పొరుగు దేశాలు విదేశీ దళాలను బయటకు పంపాలని కోరింది. ట్రంప్ పిలుపును “విన్నపం”గా వ్యాఖ్యానించింది.
అమెరికా అనుబంధ చమురు సంస్థపై...
ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ చమురు వసతులపై దాడులు జరిగితే ప్రాంతంలో అమెరికాతో అనుబంధం ఉన్న చమురు, ఆర్థిక, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఖార్గ్ దీవిపై జరిగిన దాడులు చమురు వసతులకు పెద్ద నష్టం కలిగించలేదని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది. ఆ దాడుల్లో వాయు రక్షణ కేంద్రం, నౌకాదళ స్థావరం, విమానాశ్రయ నియంత్రణ గోపురం, ఒక చమురు కంపెనీ హెలికాప్టర్ హ్యాంగర్ లక్ష్యంగా మారాయని పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం నౌకాదళ మైన్ల నిల్వ కేంద్రాలు, క్షిపణి నిల్వ బంకర్లు సహా పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించింది.
బాగ్దాద్లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయ సముదాయంలో శనివారం ఒక క్షిపణి హెలిప్యాడ్ను తాకింది. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. ఇరాన్కు అనుకూల మిలీషియా గుంపులు గతంలో ఈ రాయబార కార్యాలయంపై రాకెట్లు, డ్రోన్లతో పలుమార్లు దాడులు చేశాయి.అమెరికా విదేశాంగ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇరాక్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. వాణిజ్య విమానాలు అందుబాటులో లేకపోవడంతో భూమార్గం ద్వారా వెళ్లాలని తెలిపింది.ఇక లెబనాన్లో పరిస్థితి మరింత విషమించింది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో 800 మందికి పైగా మరణించారు. సుమారు 8.5 లక్షల మంది ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది.
సైనిక బలగాలను పెంచుతూ...
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాలు మరింత పెరుగుతున్నాయి. 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది మెరైన్లు, ‘యూఎస్ఎస్ ట్రిపోలీ’ అంబిబియస్ దాడి నౌకను కూడా ప్రాంతానికి పంపుతున్నట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు.మెరైన్ యూనిట్లు సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడమే కాకుండా రాయబార కార్యాలయ భద్రత, పౌరుల తరలింపు, విపత్తు సహాయ చర్యల్లో ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఈ బలగాల మోహరింపు భూమిపై యుద్ధ చర్యలు తప్పనిసరిగా జరుగుతాయని అర్థం కాదని అధికారులు చెప్పారు.ఇదివరకు అరేబియా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన 12 యుద్ధ నౌకలు, అందులో ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ విమాన వాహక నౌకతో పాటు ఎనిమిది డిస్ట్రాయర్లు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఎంతమంది అమెరికా సైనికులు ఉన్నారో స్పష్టంగా వెల్లడించలేదు.
Next Story

