Iran - Israel War : హోర్ముజ్ జలసంధిపై తీవ్ర ఒత్తిడి.. ప్రపంచ ఆయిల్ సరఫరాపై ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది

గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధానికి ఇది మరింత తీవ్రత తీసుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ కీలక వాయువు క్షేత్రంపై దాడి చేసిన తర్వాత ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టింది. దీంతో ఇంధన ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి గల్ఫ్ దేశాలు కూడా నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందన్న ఆందోళన పెరిగింది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ఉండటం వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రపంచ చమురు సరఫరా మరింత ఇబ్బందుల్లో పడింది.
ఈ దాడితో యుద్ధం మరింత విస్తరించినట్లు పరిశోధనా సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల జీవన పరిస్థితులను కష్టతరం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ లక్ష్యాలను ఎంచుకుంటోందని విశ్లేషించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడులు నియంత్రణ తప్పితే ప్రపంచానికే ముప్పు ఉంటుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఖతర్ శక్తి కేంద్రాలపై దాడులు కొనసాగిస్తే అమెరికా కూడా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.
ప్రదర్శనల్లో అరెస్టయిన ముగ్గురికి ఉరి
జనవరిలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టైన ముగ్గురిని ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. కోమ్ నగరంలో ఇద్దరు పోలీసులను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆందోళనలను అణచివేసే సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణల్లో న్యాయం జరగడం లేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడో వారంలోకి ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం చేరింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మందికిపైగా మరణించారు. లెబనాన్లో హిజ్బుల్లా దాడుల కారణంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు నివాసాలు విడిచారు. 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో ఇరాన్ క్షిపణి దాడుల్లో 15 మంది మృతిచెందారు. వెస్ట్ బ్యాంక్లో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

