Sat Mar 21 2026 13:56:55 GMT+0530 (India Standard Time)
దుబాయ్ లో 16 మంది దేవతామూర్తులతో భారీ హిందూ ఆలయం
ఈ ఆలయానికి అన్ని అనుమతులు లభించాయి. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ ఆలయానికి స్థలం కేటాయించగా..

ఇస్లామిక్ దేశాల్లో హిందూ ఆలయాలు ఉండటం చాలా అరుదు. తాజాగా దుబాయ్ లో 16 మంది దేవతామూర్తులతో కూడిన భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఆలయం బయటి నుంచే చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ ఆలయం నేడే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ హాజరుకానున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు మూడేళ్ల సమయం పట్టింది.
ఈ ఆలయానికి అన్ని అనుమతులు లభించాయి. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ ఆలయానికి స్థలం కేటాయించగా.. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ ఏరియాలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో శివుడు, కృష్ణుడు, వినాయకుడు, మహాలక్ష్మి విగ్రహాలతో పాటు సిక్కుల పరమ పవిత్రమైన గ్రంథం గురుగ్రంథ సాహిబ్ ను కూడా ఉంచారు. ఆలయం పై అంతస్తులో 105 కంచు గంటలను ఏర్పాటు చేశారు. దుబాయ్ లో 1958లో ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించగా.. ఇది రెండవది. అన్ని మతాల ప్రజలకీ ఆ ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని ఆలయవర్గాలు వెల్లడించాయి.
Next Story

