Sat Dec 06 2025 16:27:51 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి పంది గుండె అమర్చుకున్న వ్యక్తి మృతి
గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆయనను బ్రతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినా..

అమెరికా : ప్రపంచంలో తొలిసారి పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి 7వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్ ఆస్పత్రిలో 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ కు పందిగుండెను అమర్చి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అప్పట్లో తమ ప్రయోగం విజయవంతమైందని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. కానీ.. వారి ఆనందం ఎక్కువరోజులు నిలవలేదు. రెండు నెలల్లోనే ఆనందం ఆవిరైంది. జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన డేవిడ్ బెన్నెట్ మృతి చెందాడు.
గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆయనను బ్రతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినా.. ఫలితం లేకపోయింది. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. కాగా.. 1984లో కూడా ఇలాంటి ప్రయోగమే జరుగగా.. అది కూడా విఫలమైంది. అప్పట్లో కోతి నుంచి సేకరించిన గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా ఆయన 21 రోజులకే మరణించారు. ఈసారి బెన్నెట్ 2 నెలలు జీవించడంతో.. ఇదికాస్త మెరుగైన ఫలితమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Next Story

