Thu Dec 18 2025 17:49:54 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh : క్రికెటర్ నుంచి పార్లమెంటు దాకా..? కొడితే సిక్స్ అలా కొట్టాడు మరి
బంగ్లాదేశ్ ఎన్నికల్లో క్రికెటర్ షకీబ్ అల్ హసన్ భారీ మెజారిటీతో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.

బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో క్రికెటర్ షకీబ్ అల్ హసన్ భారీ మెజారిటీతో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ ఆయన బంగ్లాదేశ్ కెప్టెన్ గా వ్యవహరించారు. చిన్న దేశం నుంచి వచ్చినా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేంతగా వారి ఆట తీరు ఉంది. బంగ్లాదేశ్ లో క్రికెట్ అభిమానులు ఎక్కువే. మన దేశం లాగానే ఎక్కువ మంది ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు.
కెప్టెన్ గా ఉన్న షకీబ్ అల్ హసన్...
అయితే నిన్న జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో కెప్టెన్ గా వ్యవహరించిన షకీబ్ అల్ హసన్ ను ఆ దేశ ప్రజలు గెలిపించుకుని క్రికెట్ పట్ల తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మగురా పార్లమెంటు స్థానం నుంచి షకీబ్ అల్ హసన్ పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థిపై లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంతటి భారీ మెజారిటీ లభించడమంటే ఆషామాషీ కాదు. ఆయన అవామీ లీగ్ తరుపున పోటీ చేశారు. ఆయన ప్రచారం కొద్దిరోజులే చేసినా విజయం మాత్రం ఆయన వెంటే ఉంది.
హసీనా ప్రభుత్వమే మళ్లీ...
బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ నే ప్రజలు ఆశీర్వదించారు. 299 స్థానాలకకు ఎన్నికలు జరగగా, బంగ్లాదేశ్ పార్లమెంటులో ఆ పార్టీకి రెండు వందల స్థానాలు లభించాయి. షేక్ హసీనా వరసగా ఐదోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం మీద షకీబ్ అల్ హసన్ ఎంపీగా గెలవడంతో ఆయన క్రికెట్ కు ఇక గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన మూడు పదుల వయసులో ఉన్నారు. కంగ్రాట్స్ హసన్ అంటూ క్రికెట్ ఫ్యాస్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
Next Story

