అంగుళం ఇస్తే.. మైలు తీసుకుంటాడు..!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, దౌత్యపరంగా సంచలనం సృష్టించింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు భారత్పై ట్రంప్ విధించిన సుంకాలను చైనా కూడా బహిరంగంగానే విమర్శిస్తోంది. గురువారం, చైనా రాయబారి ట్రంప్ టారిఫ్ నిర్ణయాన్ని తప్పు అని ఖండించారు. ట్రంప్ను అపవాది అని పిలిచారు. అంతే కాదు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు ఇది ముప్పు అని కూడా చైనా పేర్కొంది.
న్యూఢిల్లీలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ గురువారం అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ టారిఫ్పై ట్రంప్ నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అపవాది అని కూడా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన SCO సమావేశంలో పాల్గొంటారు. ఎవరి పేరు చెప్పకుండానే, చైనా రాయబారి జు ఫీహాంగ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో పోస్ట్ చేసి, దుష్టుడికి ఒక అంగుళం ఇస్తే.. అతను ఒక మైలు తీసుకుంటాడని రాశాడు.
భారత్పై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకం నేరుగా రెండింతలు పెరిగి 50 శాతానికి చేరుకుంది. రష్యాతో చమురు వాణిజ్యానికి భారత్ స్వస్తి పలకాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే, అమెరికాకు భారత్ కూడా తగిన సమాధానం ఇచ్చింది. రష్యాతో వ్యాపారం చేసే వారే భారత్ను రష్యాతో వ్యాపారం చేయకుండా అడ్డుకుంటున్నారని భారత్ పేర్కొంది.

