Mon Dec 15 2025 08:55:34 GMT+0000 (Coordinated Universal Time)
మెక్సికోలో దారుణం.. కాల్పుల్లో 12 మంది మృతి
మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది మరణించారు

మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పన్నెండు మంది మరణించారు. మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఇరాపుయాటో నగరంలో జరిగిన వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవ్వగా, ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. బాప్టిస్ట్ సెయింట్ జాన్ జన్మదినం సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. కాల్పులు ఎందుకు జరుపుతున్నారో? ఎవరు జరుపుతున్నారో తెలియక భయాందోళనలతో ప్రజలు పరుగులు తీశారు.
తొక్కిసలాటలో ఇరవై మందికి...
ప్రజలు కాల్పుల మోత వినిన వెంటనే ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి దాదాపు ఇరవై మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. కాల్పుల ఘటనకు కారణమైన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అయితే కాల్పుల ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ విచారం వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోస గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నేరమయమైన రాష్ట్రంగా...
ఇదే రాష్ట్రంలోని శాన్ బార్డోలో డి బెర్రియోస్ లోని క్యాథలిక్ చర్చిలో గత నెలలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపగా ఏడుగురు మృతి చెందారు. గ్వామెక్సికో వాయువ్య ప్రాంతంలో నాజువాటో రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రాల్లో ఒకటి అని చెబుతారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,435 మంది మరణించారు. ఆధిపత్యం కోసం వివిధ గ్రూపుల మధ్య పోరు నిత్యం జరుగుతూనే ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది రెట్టింపు అని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
Next Story

