Fri May 23 2025 20:42:17 GMT+0000 (Coordinated Universal Time)
Turkey :పాక్ కు టర్కీ ఎందుకు సాయం చేస్తుంది? దీనికి కారణాలివేనా?
పాక్ ఆర్మీ భారత్ పై ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ దేశానికి చెందినవే.

పాక్ ఆర్మీ భారత్ పై ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ దేశానికి చెందినవే. వాటి శకలాలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాత భారత ప్రభుత్వం నిర్ధారించింది. టర్కీకి భారత్ పై అంత కోపమెందుకు? పాక్ పై అంత ప్రేమ ఎందుకు? అన్నది అంతుచిక్కడం లేదు. గురువారం పాక్ భారత్ గగనతలంపైకివచ్చి దాడులకు దిగిన వన్నీ టర్కీలో తయారయిన డ్రోన్లు అని భారత ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. టర్కీతో భారత్ కు ఎటువంటి శతృత్వం లేదు. పైగా సాయం అందించిన భారత్ ను ఇబ్బంది పెట్టడానికి పాక్ కు టర్కీ ఉపయోగపడుతుందని అంటున్నారు. 2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు ప్రపంచంలో తొలిసారిగా స్పందించింది భారత్ మాత్రమే. సాయం ప్రకటించి భారత్ తన ఉదారతను చాటుకుంది.
పెద్ద సంఖ్యలో పాక్ కు పంపి...
అలాంటి భారత్ పైన దాడులు చేయడానికి పాక్ కు టర్కీ తాను తయారు చేసిన డ్రోన్లను ఇచ్చిందంటే ఏమనాలి? నిన్న భారత్ సైన్యం ప్రకటించినట్లు కేవలం గురువారమే పాక్ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి నిర్వీర్యం చేసినప్పటికీ అవి టర్కీ దేశం పాక్ కు పంపినవేనని తేలడంతో ఒకరకంగా విస్తుపోవడం భారత్ వంతయింది. టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా నిర్ధారించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు భారత్ అంటే పడదు. ఎప్పుడూ విషం చిమ్ముతుంటాడని అంటారు. పహాల్గాం ఉగ్రదాడి గత నెల 22వ తేదీన జరిగితే ప్రపంచమంతా ఈ ఉగ్రదాడిని ఖండిస్తే ఎర్డోగాన్ మాత్రం పాక్ ప్రధానిని కలిసినప్పుడే అనుమానించాల్సింది.
ఆరు సైనిక విమానాల్లో...
ఆరు సైనిక విమానాల్లో టర్కీ భారత్ కు ఈ డ్రోన్లను పంపిందని భారత ప్రభుత్వం గుర్తించింది. కేవలం డ్రోన్లను మాత్రమే కాకుండా టర్కీ ఆయుధాలను కూడా సరఫరా చేస్తుందని తేలింది. టర్కీకి చెందిన హెర్క్యులస్ విమానం పాక్ లో దిగిన విషయాలను కూడా గుర్తించాయి. ఒక యుద్ధనౌకను కూడా టర్కీ కరాచీ నౌకాశ్రయానికి పంపిందని సమాచారం అందింది. టర్కీ కుటిల బుద్ధి ఏందో ప్రపంచానికి తెలిసింది. అంతర్జాతీయ సమాజం యావత్తూ పాక్ లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలని కోరుకుంటుంటే, టర్కీ మాత్రం దానిని వెనుకేసుకు రావడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే సమయం వచ్చినప్పుడు టర్కీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సోషల్ మీడియాలో పలువురు భారత్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story