Wed Dec 17 2025 14:14:59 GMT+0000 (Coordinated Universal Time)
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బలూచిస్థాన్.. ఐదుగురు జవాన్లు మృతి
డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. పాక్ సైన్యంపై..

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ఆదివారం (డిసెంబర్ 25) వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ప్రమాదవశాత్తు ఆర్మీ ఆపరేషన్లో పేలిన బాంబుల ధాటికి ఐదుగురు పాక్ జవాన్లు మృతి చెందగా.. మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. పాక్ సైన్యంపై కహాన్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన దాడిలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహన్ ప్రాంతంలో 'లీడింగ్ పార్టీ' సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
క్వెట్టాలోని శాటిలైట్ టౌన్లో ఉన్న పోలీస్ చెక్ పోస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే క్వెట్టాలో జరిగిన మరో గ్రనేడ్ దాడిలో నలుగురు గాయపడ్డారు. దేశమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాక్ ఆర్మీపై ఉగ్రవాదులు ఎదురుదాడి చేయడం కలకలం రేపింది.
Next Story

