Thu Feb 05 2026 08:55:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

హైదరాబాద్ లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా అనేక ప్రాంతాల్లో నీట మునకకు గురవుతున్నాయని, వెంటనే ఇళ్లలో నుంచి నీటిని తోడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్
అలాగే పురాతన భవనాలను గుర్తించి వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైడ్రా అధికారులతో పాటు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసుల సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారులపై మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని సూచించడంతో అధికారులందరూ ఉదయం నుంచి రాత్రి వరకూ విధుల్లో ఉండాలని, జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Next Story
