Sat Apr 27 2024 01:28:02 GMT+0000 (Coordinated Universal Time)
వీధికుక్క స్వైర విహారం.. 16 మందిపై దాడి
నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది..
భాగ్యనగరంలో రోజురోజుకీ కుక్కల బెడద పెరిగిపోతోంది. వీధులతో పాటు ప్రధాన రహదారుల్లోనూ కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాహనాలపై వెళ్లేవారు, నడిచివెళ్లేవారిపైనా ఇష్టారాజ్యంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. తాజాగా నగరంలోని బాలానగర్ లో ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. ఓ చిన్నారి సహా 16 మందిపై దాడి చేసి గాయపరించింది. బాలానగర్ పరిధిలోని వినాయక నగర్ లో ఓ వీధి కుక్క.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది.
శనివారం (మార్చి 11) రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క ఎగబడి కరిచింది. క్షతగాత్రుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు. ఇంకా నగరంలోని చాలా ప్రాంతాల్లో కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కాగా.. 20 రోజుల కిందట అంబర్పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్.. కుక్కల దాడిలో చనిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా జీహెచ్ఎంసీ వీధి కుక్కలను పట్టుకోవడంపై దృష్టి పెట్టలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story