Thu Mar 19 2026 00:48:42 GMT+0530 (India Standard Time)
Vegetables : కొండెక్కిన కూరగాయల ధరలు .. కొనలేక వినియోగదారుల అవస్థలు
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అకాల వర్షాలతో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి

కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అకాల వర్షాలతో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. గాలివాన దెబ్బకు అనేక పంటలు దెబ్బతినడంతో కూరగాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు కూడా తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతాయని అంటున్నారు. వర్షం కురవడమే కాకుండా, గాలివానకు పంటలు తీవ్రంగా నష్ట పోవడంతో ఉత్పత్తి కూడా తగ్గిందన్నది వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్న వాదనగా ఉంది.
రైతు బజార్లలోనే...
టమాటా కిలో ధర అరవై రూపాయలకు పైగానే పలుకుతుంది. కిలో బెండకాయ ధర ఎనభై రూపాయలు పలుకుతుంది. కిలో పచ్చి మిర్చి ధర 120 రూపాయల వరకూ ఉంది. రైతు బజార్లలోనే ఈ ధరలు ఉంటే ఇక సాధారణ మార్కెట్ లో ధరలను మరింత పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. ధరలు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. కూరగాయల ధరలు ఒక్కసారిగా రెట్టింపు కావడానికి దళారులే కారణమన్న మరో ఆరోపణ కూడా ఉంది.
అకాల వర్షంతోనే...
రైతు బజార్లలో ధరలు పెరగడంతో బయట మార్కెట్ లో ధరలు మరింత పెరిగాయి. ఆకుకూరలు ధరలు కూడా పెరిగాయి. ఇరవై రూపాయలకు గతంలో ఆరు తోటకూర కట్టలు వచ్చేవి ఇప్పుడు నాలుగే ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఏం తిని బతకాలని ప్రశ్నిస్తున్నారు. కూరగాలయ ధరలు నింగినండటంతో కొనుగోలు చేయలేక వాటి వినియోగం తగ్గించుకోవాల్సి వస్తుందని తెలిపారు. మొన్నటి వరకూ కిలో ఇరవై రూపాయలు పలికిన టమాటా ధర నేడు అరవై రూపాయలకు చేరింది. అన్ని ధరలు ఇలా పెరిగిపోతుండటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

